తమిళ చిత్రసీమలో గురువారం ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిబంధనలు ఉల్లఘించారనే కారణంతో అగ్ర హీరోలు ధనుష్, విశాల్, శింబు, అథర్వలకు తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ రెడ్ కార్డును జారీ చేసిందని సమాచారం. నిర్మాతల మండలి అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో విశాల్ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆయనకు రెడ్ కార్డ్ జారీ చేశారని చెబుతున్నారు. 2021లో నిర్మాత మైఖేల్ రాయప్పన్, శింబు మధ్య వివాదం తలెత్తింది. సినిమాకు అరవై రోజుల డేట్స్ కేటాయించిన శింబు కేవలం 27 రోజుల మాత్రమే షూటింగ్లో పాల్గొన్నాడని, దాంతో తాను భారీగా నష్టపోయానని నిర్మాత మైఖేల్ రాయప్పన్ రెండేళ్ల క్రితం పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు నేపథ్యంలో శింబుపై రెడ్ కార్డ్ ఇష్యూ చేశారని తెలిసింది.
ఇక అగ్ర హీరో ధనుష్ తెనండాల్ అనే నిర్మాణ సంస్థలో ఓ సినిమా అంగీకరించి షూటింగ్ మొత్తం పూర్తి చేయకుండానే మధ్యలో వదిలివెళ్లాడని నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. యువ హీరో అథర్వ సైతం మదియలకన్ అనే నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న సినిమాకు అంగీకరించి షూటింగ్ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించాడని తెలిసింది. గతంలోనూ ఇదే తరహాలో పలువురు అగ్ర నటులపై రెడ్ కార్డ్ జారీ కావడంతో కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.