తెలంగాణ గ్రామదేవతల నేపథ్యంలో ఆధ్యాత్మిక, మార్మిక అంశాల కలబోతగా రూపొందిస్తున్న డివైన్ ఎంటర్టైనర్ ‘ఎల్లమ్మ’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ నగర శివారులో మొదలైనట్లుగా సమాచారం. ‘బలగం’ వంటి ప్రశంసాత్మక చిత్రం తర్వాత దర్శకుడు వేణు యెల్డండి రూపొందిస్తున్న ఈ సినిమా నిర్మాణ దశలోనే ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఫస్ట్గ్లింప్స్కు అద్భుతమైన స్పందన లభించడంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్రాజ్తో పాటు కొందరు ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని, దేవిశ్రీప్రసాద్ త్వరలో ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతారని తెలిసింది. ఈ సినిమాలో కథానాయికను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.