Radheshyam release date | కరోనా థర్డ్వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా తమ విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ట్రిపుల్ ఆర్, భీమ్లానాయక్, ఆచార్య వంటి సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. తాజాగా రాధేశ్యామ్ చిత్రబృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. గత నెల జనవరి14న ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉండగా కరోనా ఉదృతి పెరగడం..పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు అమలు కావడం వంటి కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ పోస్టర్ను విడుదలచేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇందులో కీలకపాత్ర పోషించనున్నాడు. గత కొన్ని రోజుల నుండి ఈ చిత్రం ఓటీటీలో రానున్నట్లు..ప్రముఖ ఓటీటీ సంస్థ నుండి 500 కోట్ల వరకు ఆఫర్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనిపై దర్శకుడు రాధాకృష్ణ స్పందించి ఈ చిత్రం ఒక విజువల్ వండర్ అని ప్రేక్షకులు థియేటర్లోనే ఈ చిత్రాన్ని ఎక్స్పీరియెన్స్ చేయాలని..లేదంటే వాళ్ళని మోసం చేసినట్లు అవుతుందని..ఖచ్చితంగా థియేటర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని వివరణ ఇచ్చాడు.
పీరియాడికల్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హస్త సాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్-గోపికృష్ణ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోప్రభాస్కు జోడిగా పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. జస్టిన్ ప్రభాకరణ్ సౌత్ వెర్షన్కు సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి:మనోజ్ పరమహంస, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు.