Raviteja-Gopichand Malineni | యధార్థ సంఘటనల ఆధారంగా అని కనిపిస్తే చాలు ఆ సినిమాపై ఎక్కడలేని క్యూరియాసిటీ వస్తుంది. ఒకప్పుడు సంచలనం సృష్టించిన నిజ జీవిత కథలు, మరుగున పడిపోయిన వాస్తవ కథల గురించి చర్చించే కథలు.. సినిమా రూపంలో తెరకెక్కుతున్నాయంటే అందరిలోనూ అమితాస్తి నెలకొంటుంది. ఇప్పుడు అలాంటి కథతోనే రవితేజ-గోపిచంద్ మలినేని కాంబోలో నాల్గో సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన చుండూరి కథతో వీళ్ల సినిమా రానుందట.
సరిగ్గా మూడు దశాబ్దాల క్రీతం చుండూరు అనే గ్రామంలో దాదాపు మూడొందల మంది అగ్రవర్గానికి చెందిన వ్యక్తులు అత్యంత క్రూరంగా 8 మంది దళితులను హత్య చేశారు. ఈ ఘటనను చుండూరు హత్యకాండగా అభివర్ణిస్తుంటారు. ఆ సమయంలో దళితుల్ని ఊచకోత కోసిన ప్రదేశంగా చుండూరు చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి కథనే గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. వీటికి ఇటీవల రిలీజైన పోస్టర్ కూడా బలం చేకూర్చుతుంది. మోషన్ పోస్టర్లో మంటల్లో తగలబడిపోతున్న గ్రామాన్ని చూపించారు.
ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఇదే కథ నిజమైతే మాత్రం గోపిచంద్ మలినేని రిస్క్ చేసినట్లే అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో క్రాక్ విషయంలోనూ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో జరిగిన కొన్ని ఘటనల్ని బేస్ చేసుకుని తెరెకెక్కించాడు. అప్పుడు ఆ ప్రాంతాల వారు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. ఇక ఇప్పుడు మరోసారి అంతకు మించి అన్న విధంగా ఈ కథ ఉంది. ఎందుకంటే, ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అలాంటి ఇష్యూను తెరపై చూపించబోతున్నాడంటే ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.