‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో కథానాయకుడిగా అందరికి దగ్గరయ్యారు కార్తికేయ గుమ్మకొండ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం కార్తికేయ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలివి.
దర్శకుడ అజయ్భూపతి ద్వారా నాకు క్లాక్స్ పరిచయం అయ్యారు. కరోనా సమయంలో నాకు క్లాక్స్ ఈ కథ చెప్పాడు. 2012 సమయంలో ప్రపంచం అంతం అయిపోతుందనే ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలో జరిగే కథ కావడంతో ఆసక్తిగా అనిపించింది. కథలో కొత్తదనంతో పాటు వినోదం కూడా వుంటుంది. రెండున్నర గంటలు పూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా సినిమా వుంటుంది.
శివ ఓ స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు జీవిస్తాడు. సిటీలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి ఊరు వెళతాడు. ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తున్నారా? ఎవరైనా నేను చేసిన పని గురించి ఆలోచిస్తున్నారా? అని అసలు పట్టించుకోడు. ఎవరిని ఇబ్బంది పెట్టడు. వాడి పని వాడు చేసుకుంటాడు. నచ్చని విషయం చేయమంటే అసలు చేయడు.
బెదురులంక ప్రపంచం మాత్రమే తెలిసిన ప్రెసిడెంట్ అమ్మాయిగా నేహాశెట్టి కనిపిస్తుంది. శివతో ప్రేమలో వుంటుంది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ఎలా వుండాలో, ఆ పరిధి మేరకు వుంటాయి. సీన్స్ అన్ని క్యూట్గా వుంటాయి. సాంగ్స్, సీన్స్ షూట్ చేసినప్పుడు మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందని అర్థమైంది.
కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వుంటున్నాను. సినిమాలు ప్రకటించలేదు కానీ చర్చలు అయితే జరుగుతున్నాయి. యూవీ క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నా.యాక్షన్ అండ్ క్రైమ్ కామెడీ జానర్ ఫిల్మ్ అది. ప్రశాంత్ అనే కొత్త దర్శకుడితో ఆ సినిమా చేస్తున్నాను. మరో రెండు మూడు చిత్రాలు చర్చల దశలో వున్నాయి.
అజయ్ భూపతి, నేను కలిసి ఓ సినిమా చేయాలనే ప్లాన్ వుంది. అది సీక్వెల్ కాదు. సరైన కథ కుదరాలి. కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాం. అన్ని కుదిరినప్పుడు ఆ సినిమా ప్రకటిస్తాం.