‘పుష్ప’ ఫ్రాంఛైజీలో పుష్పరాజ్, శ్రీవల్లి జోడీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఇద్దరు మరోమారు వెండితెరపై సందడిచేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ ‘రాకా’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో దీపికా పడుకోన్ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాలో మరో నాయికకు చోటుందని, కథాగమనంలో ఆమెది అత్యంత కీలకమైన పాత్ర అని చెబుతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం రష్మిక మందన్నను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతున్నది. మానవాతీత శక్తులు కలిగిన యువతిగా ఆమె పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో రష్మికతో పాటు మృణా ల్ ఠాకూర్, జాన్వీకపూర్ కూడా కీలక పాత్రల్ని పోషించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సన్పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకురానుంది.