కన్నడ సొగసరి రష్మిక మందన్న సినీరంగంలో అడుగుపెట్టిన వేళా విశేషం బాగున్నట్టుంది. ఇటు దక్షిణాదిలో అగ్ర కథానాయిల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు బాలీవుడ్లో కూడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ‘పుష్ప’ చిత్రంతో దేశవ్యాప్తంగా యువతకు చేరువకావడంతో ఆమెకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాజాగా ఈ భామ సినిమాలకు రేటింగ్స్ అందించే ప్రఖ్యాత వెబ్సైట్ ఐఎండీబీ సెలబ్రిటీ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్, నాని, కీర్తి సురేష్ వంటి తారల్ని వెనక్కి నెట్టి ఈ భామ మూడో ర్యాంకులో నిలవడం విశేషం.
‘పుష్ప’ చిత్రం ద్వారా వచ్చిన క్రేజ్తో పాటు హిందీలో గుడ్బై, మిషన్ మజ్ను వంటి చిత్రాలు కూడా రష్మికకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. సోషల్మీడియాలో నిత్యం అభిమానులతో అందుబాటులో ఉండటం, ఇటీవల విడుదలైన ‘పుష్ప-2’ గ్లింప్స్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఆ చిత్ర కథానాయికగా రష్మిక మందన్న వార్తల్లో నిలిచిందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తున్నది.