కన్నడ చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించిందని గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్ని ఖండించింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. తనపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. ‘కాంతార’ సినిమా విషయంలో తనపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. “కాంతార’ సినిమా చూసిన వెంటనే చిత్ర బృందానికి మెసేజ్ పెట్టాను. నా వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు ఏమాత్రం అవసరం లేదు. అయితే వృత్తిపరంగా మాత్రం నేను ఏం చేస్తున్నానో ప్రజలకు తెలియజేయడం నా బాధ్యతగా భావిస్తా.
నటీనటుల మధ్య ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడించలేను. మెసేజ్లు బయటకు చూపించలేను’ అని రష్మిక మందన్న పేర్కొంది. అసలు ‘కాంతార’ చిత్ర బృందం, రష్మిక మందన్న మధ్య తలెత్తిన వివాదం పూర్వాపరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం ఓ ప్రైవేట్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటిగా తన ప్రస్థానం గురించి వివరించింది రష్మిక మందన్న. అయితే తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన సంస్థ పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు.
ఈ విషయంలో కన్నడ ప్రేక్షకులతో పాటు అక్కడి పరిశ్రమకు చెందిన కొందరు రష్మిక మందన్న మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ చిత్రానికి ‘కాంతార’ ఫేం రిషబ్శెట్టి దర్శకత్వం వహించారు. ఆయనే నటిగా రష్మికకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. దాంతో ఆ ఇంటర్వ్యూ చూసిన వారు.. తొలి సినిమా ఛాన్స్ ఇచ్చిన రిషబ్శెట్టిపై రష్మికకు ఎలాంటి కృతజ్ఞతా భావం లేదని విమర్శించారు. రష్మికను కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని సోషల్మీడియాలో చర్చ మొదలైంది. ఈ వార్తలన్నింటికి చెక్ పెడుతూ తాజాగా రష్మిక మందన్న తన స్పందనను తెలియజేసింది.