Actress Rashmika Mandanna | దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా జోరు చూపిస్తుంది రష్మిక మందన్నా. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ రెండో సినిమా ‘గీతా గోవిందం’తో తిరుగులేని పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్పతో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. ఈ సినిమాతో ఏకంగా మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్లలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి మరో బాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. జర హట్కె జర బచ్కెతో ఫుల్ ఫామ్లోకి వచ్చేసిన విక్కీ కౌశల్ తన తదుపరి సినిమాను ఆ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉత్కర్తోనే చేస్తున్నాడు. పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా ఎంపిక అయినట్లు తెలుస్తుంది. మరాఠి చారిత్రాత్మక నవల ఆధారంగా చావా సినిమా రూపొందనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా లెవల్లో కాస్త ఎక్కవ బడ్జెట్తోనే ఈ సినిమా తెరకెక్కనుందట.
ప్రస్తుతం రష్మిక పుష్ప సీక్వెల్తో పాటు యానిమల్ సినిమా చేస్తుంది. ఇటీవలే యానిమల్లో తన పార్ట్ కూడా పూర్తి చేసుకుంది. వీటితో పాటుగా నితిన్తో ఓ సినిమా చేస్తుంది. ఇక రేయిన్బో అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తుంది.