Ranveer Singh | బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ వివాదంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై కనీసం 18 నెలల పాటు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, అలాగే ఏ జర్నలిస్టుకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన తదుపరి చిత్రం ‘ప్రళయ్’ విడుదల అయ్యేవరకు ఈ మౌనం కొనసాగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఒక బాలీవుడ్ మీడియా రణ్వీర్ని కలిసిన అనంతరం మాట్లాడుతూ.. మేము రణ్వీర్ను వ్యక్తిగతంగా కలిశాము. ‘డాన్ 3’ వివాదంపై మాట్లాడనని, కనీసం 18 నెలల పాటు ఇంటర్వ్యూలు ఇవ్వనని ఆయన స్పష్టం చేశారని తెలిపింది.
రణ్వీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ మధ్య ‘డాన్ 3’ విషయంలో తలెత్తిన విభేదాలు బాలీవుడ్లో పెద్ద వివాదంగా మారాయి. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా రణ్వీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. వరుసగా షూటింగ్ వాయిదా పడటం, ఫైనల్ స్క్రిప్ట్ లాక్ కాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా టాక్ వినిపించింది. సాధారణ కాస్టింగ్ మార్పులా కనిపించిన ఈ వ్యవహారం కాస్తా చట్టపరమైన వివాదానికి దారితీసింది. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రణ్వీర్ నుంచి రూ.45 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయగా, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఆయనపై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఆ ఆదేశాలను ఉపసంహరించుకున్నారు.
ఇదిలా ఉండగా, రణ్వీర్ నటిస్తున్న ‘ప్రళయ్’ చిత్రం పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. శిథిలమైన ముంబై నగరం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో AI-డ్రివెన్ విజువల్స్ను వాడనున్నారు. దర్శకుడు హన్సల్ మెహతా కుమారుడు జై మెహతా ఈ సినిమాతో థియేట్రికల్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. గతంలో ‘స్కామ్ 1992’, ‘లూటేరే’ సిరీస్లకు సహ దర్శకత్వం వహించిన జై, రియలిస్టిక్ కథనాలకు పేరుగాంచారు. హన్సల్ మెహతా, సమీర్ నాయర్కు చెందిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. స్క్రిప్ట్ పనులు పూర్తి కావడంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ‘ప్రళయ్’ విడుదల అయ్యేవరకు ‘డాన్ 3’ వివాదంపై రణ్వీర్ మౌనం వహించనున్నట్లు తెలుస్తోంది.