Shamshera Trailer | బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో షంషేరా ఒకటి. సంజూ తర్వాత నాలుగేళ్ళకు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. రణ్బీర్ గతంలో ఎన్నడూ చూడని అవతారంలో ఈ చిత్రంలో కనిపించనున్నాడు. పీరియాడిక్ యక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. 2018లో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం ఎన్నో ఒడిదుడుకులతో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎన్నో వాయిదాల తర్వాత జూలై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.
‘ఆ మనిషిదే ఈ కథ.. బానిసత్వానికి మించిన నరకం వేరేలేదని అతను అనేవాడు. యాచించడానికి స్వాతంత్య్రం భిక్ష కాదని, పోరాడి సాధించుకోవాలని చెప్పేవాడు’ అంటూ ట్రైలర్ మొదలైంది. ‘షంషేరాదే ఈ ప్రస్తుత కథ’ అంటూ రణ్బీర్ ఎంట్రీ ఆకట్టుకుంటుంది. ‘అరే ఏదైనా కొత్త మాట చెప్పు కజూరి.. ఈ మాటైతే చిన్నప్పటి నుండి వింటూ వింటూ పెద్దయ్యాను’ అంటూ రణ్బీర్ పలికే డైలాగ్ అలరిస్తుంది. ‘ఇప్పుడు సుద్ధసింగ్ వీళ్ళను నాశనం చేస్తాడు’ అంటూ సంజయ్ దత్ పలికే సంభాషణ క్రూరత్వాన్ని డిఫైన్ చేస్తుంది. ‘నీలో షంషేరా రక్తం ప్రవహిస్తుందిరా.. భయపడొద్దు, ధైర్యంగా ఉండు’ అనే డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ట్రైలర్ చివర్లో ‘కర్మ వల్ల దొంగలం.. ధర్మంగా స్వతంత్రులం’ అంటూ చివర్లో చెప్పే డైలాగ్ ట్రైలర్కే హైలైట్గా నిలిచింది. ఈ చిత్రంలో రణ్బీర్ తండ్రి, కొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అనయ్ గోస్వామి కెమెరా విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి.
రణ్బీర్ ఈ సినిమాలో 1800 కాలం నాటి స్వాతంత్య్ర కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ ప్రతి నాయకుడి పాత్రలో నటించిగా.. వాణీ కపూర్లు హీరోయిన్గా నటించింది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. దీనితో పాటుగా ఈయన నటించిన ‘బ్రహ్మాస్త్రం’ కూడా ఇదే ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ప్రస్తుతం రణ్బీర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.