Virata parvam | పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉండే అతికొద్ది మంది నటులలో రానా దగ్గుబాటి ఒకడు. మొదటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు. తాజాగా ఈయన నటించిన ‘భీమ్లానాయక్’ థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో రానా నటనకు ప్రేక్షకులతో పాటు సినీ క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో తాజాగా ప్రెస్మీట్లో మాట్లాడిన రానా.. విరాటపర్వం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రానా మాట్లాడుతూ ‘ఒకటి రెండ్రోజుల్లో సినిమా ప్రివ్యూ చూడబోతున్నాను. ఓ మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి, అతి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పుకొచ్చాడు రానా . తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘నీదినాది ఓకేకథ’ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రియమణి కీలకపాత్రలో నటించింది. గతంలోనే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. గతకొంత కాలంనుంచి ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా రానా మాటలతో థియేటర్లోనే ఈ చిత్రం విడుదల కానున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.