నటి రంభ రోడ్డు ప్రమాదానికి గురైంది. కెనడాలోని ఒంటారియాలో ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. స్కూలు నుంచి పిల్లల్ని తీసుకొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో రంభ, ఆమె పిల్లలతో పాటు వాళ్ల ఆయా కూడా ఉంది. రంభకు స్వల్ప గాయాలు కాగా ఆమె కుమార్తె సాషా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నది.
ఈ ప్రమాదంపై రంభ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…‘పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్న సమయంలో ఒక కూడలి వద్ద మా కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. మాకెవరికీ పెద్దగా గాయాలు కాలేదు. పాప సాషా మాత్రం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నది.
మా కుటుంబానికి ఇదొక దుర్దినం. సాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అని పోస్ట్ చేసింది. రంభ పోస్ట్కు నాయికలు మీనా, స్నేహా తదితరులు స్పందిస్తూ..‘పాపకేం కాదు, ధైర్యంగా ఉండు’ అని కామెంట్స్ చేశారు. 2010లో వ్యాపారవేత్త ఇంద్రకుమార్ను పెండ్లి చేసుకున్న రంభ కెనడాలో స్థిరపడింది.