ముంబై: ఇటీవల ముంబై తీరంలోని క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ గురించి చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఈ కేసుపై స్పందించారు. ఆర్యన్పై వస్తున్న ఆరోపణల వల్ల ఒరిగేదేమీ లేదని ఎన్సీబీ సహా అందరికీ తెలుసని ఆర్జీవీ అన్నారు. వ్యూహాత్మకంగా అడ్డుకునే ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్యన్ బయటకు వచ్చేస్తాడని చెప్పారు.
‘షారుఖ్ కుమారుడినే వదల్లేదంటే ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి’ అనే సందేశం అందరికీ వినిపించడం కోసమే సంబంధిత ఏజెన్సీలన్నీ ఆర్యన్ను ఉపయోగించుకుంటున్నాయని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. అలాగే జైల్లో ఆర్యన్ అనుభవాలు అతని కెరీర్కు చాలా బాగు ఉపయోగపడతాయన్నారు. జైల్లో ఉండటం వల్ల ఆర్యన్ మానసికంగా దెబ్బతింటాడని చాలా మంది అనుకుంటున్న విషయాన్ని కూడా ఆర్జీవీ గుర్తుచేశారు.
అయితే తన ఉద్దేశ్యం ప్రకారం ఎన్సీబీ వల్ల అతను ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ ఆర్యన్ను మరింత రాటుదేలుస్తాయని ఈ ‘రక్త చరిత్ర’ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. జైల్లో వసతులు బాగొలేవని వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఏమీ లేని స్థాయి నుంచి సూపర్ స్టార్గా ఎదిగే క్రమంలో షారుఖ్ పడిన ఇబ్బందుల కన్నా ఆర్యన్కు ఎదురయ్యే ఇబ్బందులు చాలా చిన్నవన్నారు. కేవలం తండ్రి అవడం ద్వారా షారుఖ్ తన కుమారుడిని సూపర్ స్టార్ చేశాడని, కానీ అతన్ని సూపర్ సెన్సిటివ్ యాక్టర్గా ఎన్సీబీ తీర్చిదిద్దుతోందని ఆర్జీవీ చెప్పారు.
తండ్రి ఆధీనంలో లేకుండా వాస్తవాలను చూడటం వల్ల ఆర్యన్ పెర్ఫామెన్స్లో, వ్యక్తిత్వంలో టెర్రిఫిక్నెస్ వస్తుందన్నారు. ఆర్యన్ను లాంచ్ చేసే ప్రక్రియలో నాలుగు ముఖ్యమైన అంశాలున్నాయని ఆర్జీవీ వివరించారు.
‘‘తొలుత కుమారుడిగా షారుఖ్, ఆ తర్వాత ఆర్యన్ తొలి సినిమా దర్శకుడు, ఇప్పుడు ఎన్సీబీ, మరీ ముఖ్యంగా తండ్రి కన్నా ముందే అతన్ని లాంచ్ చేసిన మీడియా. కానీ ఈ జాబితాలో టాప్ మాత్రం ఎన్సీబీనే’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. అలాగే, జీవితం గురించి తండ్రి కన్నా జైలు, ఎన్సీబీ నుంచే తాను ఎక్కువ నేర్చుకున్నానని భవిష్యత్తులో ఆర్యన్ చెప్తాడని ఆర్జీవీ పందెం కాశారు.
‘‘షారుఖ్ నిజమైన, తెలివైన అభిమానులంతా ఎన్సీబీకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అది తమ సూపర్ స్టార్ తనయుడిని సూపర్ డూపర్ స్టార్ చేసింది. షారుఖ్ నిజమైన అభిమానిగా నేను జై ఎన్సీబీ అని అరవాలనుకుంటున్నా‘‘ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
కాగా, ఆర్యన్ బెయిలు కోసం అతని తరఫు లాయర్లు తీవ్రంగా ప్రయత్నించారు. గురువారం మరోసారి ముంబై కోర్టులో ఈ పిటిషన్ హియరింగ్ జరిగింది. కానీ.. ఆర్యన్కు బెయిలు దొరకలేదు. ఈ నెల 20 వరకు ఆర్యన్ జైల్లోనే ఉండాలి.