రామ్చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పానిండియా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో నిర్మాతగా పరిచయం అవుతున్నారు వెంకటసతీష్ కిలారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నేడు వెంకటసతీష్ పుట్టినరోజు, నేడే ‘పెద్ది’ ట్రైలర్ కూడా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారాయన. నిర్మాతగా తన తొలి సినిమాకు రామ్చరణ్ హీరో కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న నిర్మాత వెంకటసతీశ్ కిలారుతో కాసేపు.
రామ్చరణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేం. అది తెరపై చూస్తేనే తెలుస్తుంది. ఇందులో రామ్చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం. పాత్ర కోసం గాయాలను కూడా లెక్కచేయలేదాయన. శరీరాన్ని హూనం చేసుకున్నారు. కంటి దగ్గర కుట్లు పడిన మరుసటి రోజే షూటింగ్కి వచ్చారంటే, ఆయన డెడికేషన్ ఏంటో అర్థంచేసుకోవచ్చు. రామ్చరణ్ ఒప్పుకోవడం వల్లే ఇంత గొప్ప సినిమాను అనుకున్న బడ్జెట్లో గ్రాండ్ స్కేల్లో నిర్మించగలిగాను. షూటింగ్ తొలి రోజు నుంచి చివరి రోజు వరకూ అందరం పాజిటివ్ ఎనర్జీతో కూల్గా పనిచేశాం. షూటింగ్ ప్రశాంతంగా సాగిపోయింది. గుమ్మడికాయ కొట్టిన చివరి రోజున హీరో రామ్చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబులతో పాటు టీమ్ అంతా ఎమోషనల్ అయ్యారు
సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అంశాలన్నింటినీ ఏర్చి కూర్చి, ఓ ప్యాకేజ్లా దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమాను తెరకెక్కించారు. టైటిల్ కార్డ్ నుంచి శుభం కార్డు వరకూ ప్రేక్షకులు సీట్ నుంచి కదలలేరు. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి. ఈ సినిమా సంగీతం విషయంలో ఏఆర్ రెహమాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
డీవోపీ రత్నవేల్ ది బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. 80ల నేపథ్యంలో సాగే కథ కావడంతో కళా దర్శకుడు అవినాష్ అద్భుతమైన సెట్స్ వేశారు. ‘పెద్ది’ ఓ ప్రత్యేకమైన ప్రపంచం. శ్రీలంక, పూణే, ఢిల్లీ వంటి రియల్ లొకేషన్లు కూడా ఇందులో ఉంటాయి. నేడు రిలీజ్ కానున్న ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచడం ఖాయం. పానిండియా, ఓవర్సీస్లో ‘పెద్ది’ గ్రాండ్గా రిలీజ్ కానున్నది.