‘నేను ‘గాడ్ ఫాదర్’ సినిమా చేసేందుకు రామ్ చరణ్ కారణం. సినిమా చూసి.. నాన్నా ఈ సబ్జెక్ట్ మీకు బాగుంటుంది అని చెప్పి ఒప్పించాడు, దర్శకుడిని కూడా తనే సెలెక్ట్ చేశాడు’ అని ఇటీవల సినిమా ప్రచార కార్యక్రమాల్లో అగ్ర హీరో చిరంజీవి చెప్పారు. మలయాళ చిత్రం ‘లూసీఫర్’ రీమేక్గా ‘గాడ్ ఫాదర్’ తెలుగు తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ స్క్రిప్ట్ జడ్జిమెంట్ బాగుందని అంటున్నారు. ఈ క్రమంలో చరణ్ మరో మలయాళ రీమేక్ హక్కులు తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
మమ్ముట్టి హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ ఈ మార్చిలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. గ్యాంగ్స్టర్ డ్రామాగా దర్శకుడు అమల్ నీరాద్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలోని కథా నేపథ్యం, క్యారెక్టర్ డిజైనింగ్, డైలాగ్స్…ఇలాంటి అంశాలకు మంచి పేరొచ్చింది. చిరంజీవి కోసమే చరణ్ ఈ సినిమా కథా హక్కులను తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మమ్ముట్టి పోషించిన అంజుట్టి మైఖేల్ పాత్ర చిరంజీవికి బాగా సరిపోతుందనేది చరణ్ ఆలోచన. ప్రస్తుతం చిరంజీవి పలు చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉన్నందువల్ల ఈ ప్రాజెక్ట్ రియాల్టిలోకి వచ్చేందుకు కొంత సమయం పట్టేలా ఉంది.