మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అగ్ర హీరో రామ్చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తమ కుటుంబంలో మూడోతరం అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. ఉపాసన డెలివరీ నేపథ్యంలో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు రాత్రే ఆసుపత్రికి వచ్చారు. మనవరాలు రాకతో మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
‘మెగా లిటిల్ ప్రిన్సెస్కు స్వాగతం. నీ రాకతో మా అందరిలో ఆనందాన్ని నింపావు. మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్ చేశావు. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులు నీపై ఉంటాయి’ అని చిరంజీవి ట్విట్టర్లో పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో మనవరాలిని చూసిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబానికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున పాప పుట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. ‘తల్లిదండ్రులైన మీ ఇద్దరికి అభినందనలు. కూతురితో గడిపే ప్రతి క్షణం జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నా’ అని రామ్చరణ్ దంపతులకు ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలందజేశారు. పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా రామ్చరణ్-ఉపాసన దంపతులకు విషెస్ తెలియజేశారు.