బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్ గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ జంట ఫిబ్రవరిలో పెళ్లిపీటలెక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలకాలంలో ప్రేమికులిద్దరూ కలిసి పలు దేవాలయాల సందర్శన చేస్తున్నారు. ఈ ఫొటోలను జాకీ భగ్నానీ తన సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వీరి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరినట్ల యింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి వార్తలపై రకుల్ప్రీత్సింగ్ స్పందించింది.
‘ప్రతి ఒక్కరూ జీవితంలోని ఏదో ఒక దశలో మనసుకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటారు. అది చాలా సహజం. నేను ఎన్నో ఏళ్లు ఒంటరి జీవితాన్ని గడిపాను. జాకీ నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఎన్నో మార్పులొచ్చాయి. అతనే నా సర్వస్వంగా మారిపోయాడు. ఇద్దరం ఇండస్ట్రీ వ్యక్తులం కావడం వల్ల ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. మా ఇద్దరి అభిరుచులు కూడా ఒకేలా ఉంటాయి. మేమిద్దరం ఫిట్నెస్ను ఎంతగానో ఇష్టపడతాం. షూటింగ్ బిజీ వల్ల ఇద్దరం కలిసి గడిపే సమయం చాలా తక్కువ. అప్పుడు కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడుకుంటాం’ అని చెప్పింది.