రవితేజ నున్నా, నేహా జురెల్ జంటగా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి-నాయుడుగారి అబ్బాయి’. సత్యరాజ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ముత్యాల రామదాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రవితేజ నున్నా, దర్శకుడు సత్యరాజ్ విలేకరులతో ముచ్చటించారు.
‘ఈ కథలో హీరోయిన్ అనుమానాస్పదంగా చనిపోతుంది. ఆమె చివరిగా కలిసింది హీరోనే. దాంతో హీరోకీ, ఈ హత్యకూ ఏమైనా సంబంధం ఉందా? ఆమెను ఎవరు హత్య చేశారు? అనే ప్రశ్నల చుట్టూ ఈ కథ నడుస్తుంది’ అని హీరో రవితేజ నున్నా చెప్పారు. నిర్మాత ముత్యాల రాందాసు, పీఆర్వో వేణుగోపాల్ ఈ సినిమాకు రెండు కళ్లని, వారి వల్లే ఇంతదూరం ప్రయాణించగలిగామని దర్శకుడు చెప్పారు.
మొదట సతీశ్ అనే నిర్మాతతో తక్కువ బడ్జెట్లో సినిమా మొదలుపెట్టామని, సినిమా బాగా వస్తుండటంతో ఎవరైనా సపోర్ట్ చేస్తే బావుండని ముత్యాల రాందాసు కలిశామని, ఈ ప్రాజెక్ట్లోకి ఆయన ఎంటర్ అయ్యాక సినిమా స్వరూపమే మారిపోయిందని, మంచి ఆర్టీస్టులు, గొప్ప టెక్నీషియన్స్ వచ్చి చేరారని దర్శకుడు చెప్పారు.
హీరో నటన విషయంలో నూటికి నూరు శాతం సంతృప్తితో ఉన్నానని, అలాగే, పాటలు తమన్ స్థాయిలో, నేపథ్య సంగీతం మణిశర్మ స్థాయిలో అద్భుతమైన సంగీతాన్ని రోషన్ సాలూరి అందించారని దర్శకుడు తెలిపారు. ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ప్రేమకథ అని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నానని ఆయన అన్నారు.
కంటెంట్ ఉన్న థ్రిల్లర్ సినిమాను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనీ, ఈ సినిమాలో కంటెంటే ప్రధానమనీ, దర్శకుడు సత్య మొదట పాటలు వినిపించి, తర్వాత కథ చెప్పాడనీ, ఆ కథ నచ్చి వెంటనే అంగీకరించానని, నటనపై ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టాననీ, నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని హీరో రవితేజ నున్నా తెలిపారు.