బెంగళూరు: ప్రముఖ సినీ హీరో, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్కు బెయిల్ మంజూరైంది. రజినీకాంత్ భార్యకు బెయిల్ ఏంటి..? ఆమెపై కేసులు ఏమున్నాయ్ అనుకుంటున్నారా..? రజినీ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన ‘కొచ్చాడియాన్’ సినిమా ప్రొడక్షన్ సమయంలో ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి నిర్మాణ సంస్థలోని ఓ వ్యక్తి తీసుకున్న అప్పుకు లతా రజినీకాంత్ గ్యారంటర్గా ఉన్నారు. ఆ అప్పును తిరిగి చెల్లించకపోవడంతో ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది.
ఈ చీటింగ్ కేసుపై విచారణ జరిపిన బెంగళూరు కోర్టు ఆమెకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు డిసెంబర్ 1న యాడ్ ఏజెన్సీ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు తీసుకున్న బెంగళూరు కోర్టు.. లతా రజినీకాంత్కు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. దాంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
కాగా, ‘కొచ్చాడయాన్’ సినిమాను భారీ ఖర్చుతో తెరకెక్కించారు. ఈ సినిమా నిర్మించిన మీడియా వన్ ఎంటర్టైన్మెంట్లో పనిచేస్తున్న మురళి అనే వ్యక్తికి.. చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.6.2 కోట్ల రుణం ఇచ్చింది. మురళికి ఇచ్చిన రుణానికి గ్యారెంటర్గా లతా రజనీకాంత్ సంతకం చేశారు. మురళి అప్పు తీర్చకపోవడంతో హామీదారుగా ఉన్న లత ఈ కేసులో చిక్కుకున్నారు.
ఇవాళ ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తు, మరో రూ.25 వేల నగదును కోర్టుకు కట్టించుకుని షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.