తమిళ చిత్రం ‘జై భీమ్’ దేశవ్యాప్తంగా చక్కటి ఆదరణ సొంత చేసుకుంది. చిత్ర దర్శకుడు టీజే జ్ఞానవేల్ విమర్శకుల ప్రశంసలందుకున్నారు. తాజాగా ఆయన సూపర్స్టార్ రజనీకాంత్తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ నటించే 170వ చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించే సినిమా ఖరారైందని నిర్మాణ సంస్థ గురువారం ప్రకటించింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్నందించబోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకుడు. అనంతరం ‘లాల్సలామ్’ అనే చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రను పోషించనున్నారు.