దివంగత మహానటుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని శుక్రవారం విజయవాడలో భారీ సభను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సూపర్స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ యుగ పురుషుడు. నా జీవితాన్ని ఆయన ఎంతగానో ప్రభావితం చేశారు. బాల్యంలో నేను చూసిన మొట్టమొదటి చిత్రం ‘పాతాళ భైరవి’. అందులో ఎన్టీఆర్ నటన నా మనసులో ముద్రించుకుపోయింది. 1963లో ఎన్టీఆర్ను ‘లవకుశ’ ఫంక్షన్ సందర్భంగా తొలిసారి చూసిన అనుభవం ఇంకా గుర్తుంది. ఎన్టీఆర్ నటించిన ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రంలో దుర్యోధనుడి పాత్రను చూసి మెస్మరైజ్ అయిపోయాను. ఆ పాత్ర నాపై ఎంతో ప్రభావాన్ని చూపింది.
నేను బెంగళూరులో బస్ కండక్టర్గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ‘కురుక్షేత్ర’ అనే నాటకం వేశాను. అందులో దుర్యోధనుడి పాత్రను పోషించాను. నాటకం ఆసాంతం ఎన్టీఆర్ను అనుకరిస్తూ అభినయించాను. ఓ రకంగా నేను నటుడిగా మారడానికి స్ఫూర్తినిచ్చింది ఎన్టీఆరే. ఆయనతో వ్యక్తిగతం కూడా నాకు గొప్ప అనుబంధం ఉంది. కేవలం సినిమాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలతో జీవితాన్ని గడిపారాయన. ‘దానవీర శూరకర్ణ’ చూసి ఆ సినిమాను రీమేక్ చేయాలని, అందులో నేను దుర్యోధనుడిగా నటించాలనుకున్నా. దర్శక నిర్మాతల్ని కూడా సెట్ చేసుకున్నా. అయితే దుర్యోదనుడి గెటప్లో నేను తీయించుకున్న కొన్ని ఫొటోల్ని నా మిత్రుడు ఒకరికి చూపించాను. అతను దుర్యోధనుడి పాత్ర నాకు సెట్టవ్వలేదని చెప్పడంతో ఆ సినిమా క్యాన్సిల్ చేశాను’ అన్నారు.