హాస్య మూవీస్ పతాకంపై సామజవరగమన, ఊరు పేరు భైరవకోన, కే ర్యాంప్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు రాజేశ్ దండా. ప్రస్తుతం ఆయన అల్లరి నరేష్తో ఓ సినిమా, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో ‘బ్లాక్గోల్డ్’ చిత్రాలను నిర్మిస్తున్నారు. నేడు రాజేశ్దండా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన బుధవారం విలేకరులతో ముచ్చటించారు.
తాను తీసే ప్రతీ సినిమాలో కథాపరంగా కొత్త పాయింట్ ఉండేలా చూసుకుంటానని, డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేసిన అనుభవంతో ప్రేక్షకులకు రీచ్ అయ్యే కథల గురించి మంచి అవగాహన ఏర్పడిందని, నిర్మాతగా అదే తన విజయ రహస్యమని చెప్పారు. నిర్మాతలు కేవలం డబ్బులు పెట్టడమే కాకుండా ప్రతి రోజూ సెట్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, కథల విషయంలో తమ అభిప్రాయాల్ని పంచుకోవాలని ఆయన అన్నారు.
కొత్త నిర్మాతలకు ఇండస్ట్రీ మీద పూర్తి అవగాహన ఉండాలని, ముఖ్యంగా సినిమా ఎలా రిలీజ్ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. తమ సంస్థలో తదుపరి సినిమాల విశేషాలు తెలియజేస్తూ “బ్లాక్గోల్డ్’ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తున్నాం. నరేష్ సినిమా షూటింగ్ వచ్చే నెలలో పూర్తవుతుంది. త్వరలో టైటిల్ అనౌన్స్ చేస్తాం. అల్లు శిరీష్, ఆది సాయికుమార్లతో సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. అడివి శేష్తో సినిమా చర్చల దశలో ఉంది. ‘సామజవరగమన’ సీక్వెల్ను వచ్చే ఏడాది మొదలుపెట్టానుకుంటున్నాం’ అన్నారు.