Nandini Gupta wins Femina Miss India 2023 : ప్రతిష్టాత్మక 59వ ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు 29 రాష్ట్రాలకు చెందిన భామలు పోటీ పడ్డారు. కాగా ఈ పోటీల్లో రాజస్థాన్కు చెందిన 19ఏళ్ల భామ నందినీ గుప్తా గెలిచి ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా, మణిపూర్కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్లు రన్నరప్గా నిలిచారు. గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీశెట్టి, నందినీ గుప్తాకు కిరీటాన్ని తొడిగారు.
ఆదివారం రాత్రి అట్ట హాసంగా జరిగిన ఈ వేడుకలకు సినీ తారలతో పాటు పలు రంగానికి చెందిన ప్రముఖులు తరలి వచ్చారు. స్టేజీపై ఆట, పాటలతో హొరెత్తించారు. ఇక కార్తిక్ ఆర్యన్, అనన్య పాండేల నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది తెలంగాణ నుంచి ఊర్మిళ చౌహన్, ఆంధ్రపదేశ్ నుంచి గోమతి ఈ పోటీల్లో పాల్గొన్నారు. గతేడాది విజేతలు సినీ శెట్టి, రూబల్ షెకావత్, షినతా చౌహాన్, మానస వారణాసి, మాణికా షియోకంద్, మాన్య సింగ్, సుమన్ రావ్ మరియు శివాని జాదవ్ మోహే లెహంగాలు ధరించి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.