మహేష్బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్కు సంబంధించిన భారీ ఈవెంట్ ఈ నెల 15న హైదరాబాద్లో జరుగబోతున్న విషయం తెలిసిందే. ‘గ్లోబ్ట్రాటర్’ (ప్రపంచ విహారి) హ్యాష్ట్యాగ్తో దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఓవైపు ఈ నెల 15న జరిగే ఈవెంట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదే వేదికపై చిత్ర టైటిల్తో పాటు ఫస్ట్గ్లింప్స్ను విడుదల చేస్తారని సమాచారం. ఈలోగా రాజమౌళి సడెన్ సర్ఫ్రైజ్లతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. బుధవారం చిత్ర కథానాయిక ప్రియాంకచోప్రా ఫస్ట్లుక్ పోస్టర్ను రాజమౌళి తన సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు.
ఇందులో ప్రియాంకచోప్రా మందాకిని పాత్రలో కనిపించనుంది. ‘విశ్వవేదికపై భారతీయ సినిమా ఘనతను చాటిన మన దేశీ గర్ల్ ప్రియాంకచోప్రా ఈ సినిమాలో ధైర్యసాహసాలు మూర్తీభవించిన మందానికి పాత్రలో కనిపించనుంది’ అంటూ రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. ‘యస్యస్ఏమ్బీ29’ వర్కింగ్టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ను ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ‘గ్లోబ్ట్రాటర్’ అనే పేరు కూడా పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 15న జరిగే ఈవెంట్లో సినిమా కథాంశంతో పాటు అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించబోతున్నారు.