సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తున్న మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి మరో కొత్త విషయం బయటకొచ్చింది. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంగా సాగే అడ్వెంచర్ జర్నీగా ఉంటుందని ఇప్పటికే తెలియగా…తాజాగా ఈ ప్రాజెక్ట్ ఫ్రాంఛైజీగా ఉండబోతున్నట్లు వెల్లడైంది. ఈ చిత్ర కథా రచయిత విజయేంద్రప్రసాద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ…‘మహేష్, రాజమౌళి సినిమాను రెండు మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నాం. ఈ ఫ్రాంఛైజీలో కథలు మారుతుంటాయి. అయితే ప్రధాన పాత్రలన్నీ కొనసాగుతాయి’ అని చెప్పారు. విజయేంద్రప్రసాద్ మాటలను బట్టి ‘బాహుబలి’లా ఇదొక భారీ ప్రాజెక్ట్ కానుందని తెలుస్తున్నది. మహేష్ బాబు నటిస్తున్న 29వ చిత్రమిది. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట.