రెండో ప్రతాపరుద్రుడు (1289-1323)
రుద్రమదేవికి మగ సంతానం లేనందున ఈమె తన కూతురు ముమ్మడమ్మ కుమారుడైన రెండో ప్రతాపరుద్రుడిని తన వారసుడిగా ప్రకటించింది.
ప్రతాపరుద్రుడు కాకతీయ సింహాసనం అధిష్టించిన తర్వాత కూడా చాలా ఏండ్లపాటు అతడిని కుమార రుద్రదేవుడనే పిలిచేవారు.
రుద్రమదేవి మరణానికి ప్రతీకారంగా అంబదేవుడిని అణచడానికి ప్రతాపరుద్రుడు నాయంకర విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి సైన్యాన్ని పటిష్టం చేశాడు.
నాయంకర వ్యవస్థలో భాగంగా మొత్తం 77 మంది నాయకులను నియమించి వారికి ఎంతెంత సైన్యాన్ని పోషించాలో, వారి ఆధ్వర్యంలో ఉన్న భూములేవో, గ్రామాలేవో వివరించి సైనికులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయించాడు.
అంబదేవుడిని, అతడి మిత్రులైన పాండ్య, యాదవ సేనలను ఎదుర్కోవడానికి త్రిముఖ వ్యూహాన్ని రూపొందించాడు.
1291లో మనుమ గన్నయ్య, అన్నయ దేవుడి నేతృత్వంలో భారీ సైన్యాన్ని అంబదేవుని కేంద్రస్థానమైన త్రిపురాంతకంపైకి పంపాడు.
ఈ యుద్ధంలో కాకతీయ చక్రవర్తి సైన్యాలు విజయాన్ని సాధించాయని త్రిపురాంతకంలో కాకతీయ సేనాధిపతి ఇందులూరి అన్నయ్య వేయించిన 1291 నాటి శాసనం తెలుపుతుంది.
అంబదేవుడిని ఓడించిన తర్వాత ప్రతాపరుద్రుడు నెల్లూరుపై దండెత్తాడు. నెల్లూరు రాజు రాజగండ గోపాలుడికి అండగా వచ్చిన పాండ్య రాజులను ఓడించాడు.
రుద్రమదేవి చివరికాలంలో కృష్ణానది దక్షిణాన కోల్పోయిన ప్రాభవాన్ని ప్రతాపరుద్రుడు ఈ విధంగా నిలబెట్టాడు.
ప్రతాపరుద్రుడి మూడో దండయాత్ర అంబదేవుడికి మద్దతుగా నిలిచిన దేవగిరి యాదవ రాజులపై జరిగింది. ఈ యుద్ధంలో ప్రతాపరుద్రుడు కృష్ణా, తుంగభద్రల ప్రాంతాన్ని దేవగిరి రాజుల నుంచి వశం చేసుకున్నాడు.
ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు మొదటి దండయాత్ర
అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్ అయిన తర్వాత 1303లో మొట్టమొదటిసారిగా ఓరుగల్లు రాజ్యంపైకి తన సైన్యాన్ని పంపాడు.
ఢిల్లీ సుల్తాన్ సేనాధిపతులైన మాలిక్ ఫక్రుద్దీన్ జానా, కారాకు చెందిన ఝాజాలు సైన్యానికి నాయకత్వం వహించారు.
వీరు తమ సేనలతో తెలంగాణలో ప్రవేశించగానే నేటి కరీంనగర్ జిల్లా ఉప్పరిపల్లి వద్ద జరిగిన యుద్ధంలో కాకతీయ సేనాధిపతులైన పోతుగంటి మైళి, రేచర్ల ప్రసాదిత్యుడి కుమారుడైన వెన్న సుల్తాన్ సేనలను తరిమికొట్టారు.
ఈ యుద్ధం గురించి తెలుగు రచన ‘వెలుగోటి వారి వంశావళి’ వివరిస్తుంది.
రెండో దండయాత్ర
ఓటమి అనంతరం ప్రతీకారంతో అల్లావుద్దీన్ ఖిల్జీ 1309లో భారీ సైన్యాన్ని మాలిక్ కపూర్, ఖ్వాజా హాజీల నాయకత్వంలో తెలంగాణపైకి పంపాడు.
1309 అక్టోబర్ నెలలో ఢిల్లీ నుంచి బయలుదేరిన సుల్తాన్ సైన్యం దేవగిరి మీదుగా వరంగల్ భూభాగాల్లోకి ప్రవేశించింది.
1310 ఫిబ్రవరి వరకు ఇరుపక్షాల మధ్య జరిగిన యుద్ధంలో చివరకు ప్రతాపరుద్రుడు ఓడిపోయి అల్లావుద్దీన్ ఖిల్జీకి ప్రతి ఏటా కప్పం చెల్లించడానికి ఒప్పుకొని సంధి చేసుకున్నాడు.
ఢిల్లీ సుల్తాన్ సేనల చేతిలో ఓడి సామంతరికాన్ని అంగీకరించిన ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా అతడి సామంతులు తిరుగుబాట్లు లేవదీశారు.
వారిలో నెల్లూరు తెలుగు చోళ నాయకుడు రంగనాథుడు, వైదుంబ నాయకుడు గండికోట మల్లిదేవుడు ముఖ్యులు.
వారిని అణచడానికి ప్రతాపరుద్రుడు ‘జట్టయలెంక గొంకయరెడ్డి’ నేతృత్వంలో సైన్యాన్ని పంపాడు. ఇతడు వారిని అణచివేశాడు.
1311లో పాండ్య రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్ సేనలు దండెత్తగా, సుల్తాన్ కోరిక మేరకు ప్రతాపరుద్రుడు తన సేనలతో కలిసి యుద్ధంలో పాల్గొన్నాడు. ప్రతాపరుద్రుడి సేనాని ముప్పిడి నాయకుడు దండయాత్రలో కీలకపాత్ర పోషించాడు.
1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణం తర్వాత అతడి సైనికులు ఢిల్లీ తిరిగి వెళ్లారు. అప్పుడు ఒంటరిగా మిగిలిన ప్రతాపరుద్రుడి సేనలు నెల్లూరు పాలకుడితో, హొయసాల రాజైన మూడో బల్లాళుడితో, పాండ్య రాజైన వీరపాండ్యునితో పోరాడాయి.
ఈ యుద్ధంలో ప్రతాపరుద్రుడి సేనాధిపతి ‘పెదరుద్రుడు’ హొయసాల, చంద్రగిరి పాలకులను ఓడించాడు. కాంచీనగరం కాకతీయుల వశం అయింది.
ఈ పరిస్థితుల్లో పాండ్యులు కాకతీయ సైన్యాలను ఎదుర్కోవడానికి రాగా ప్రతాపరుద్రుడు స్వయంగా కాకతీయ సేనలను యుద్ధరంగంలోకి నడిపాడు.
ఈ యుద్ధంలో కాకతీయుల విజయానికి గుర్తుగా కాకతీయ సేనాధిపతి దేవరి నాయకుడు 1317లో కావేరి ద్వీపంలోని ‘శలకలపాడు’ గ్రామంలోని శ్రీరంగనాథుని ఆలయానికి కొన్ని దానాలు చేసినట్లు శాసనాధారాలు తెలుపుతున్నాయి.
ఈ విధంగా ప్రతాపరుద్రుడు 1312-16లో దక్షిణాపథంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు.
మూడో దండయాత్ర (1318)
అల్లావుద్దీన్ ఖిల్జీ మరణం తర్వాత సుల్తాన్ అయిన అతడి కుమారుడు కుతుబుద్దీన్ ముబారక్ షా 1318లో దక్షిణాపథంలో తన తండ్రికాలంలో సామంతులుగా ఉన్న రాజ్యాధినేతలపైకి సైన్యాన్ని పంపాడు.
మొదట దేవగిరి రాజ్యంపై దండెత్తిన తర్వాత ఆ వెంటనే తన సేనాధిపతి అయిన ఖుస్రూఖాన్ను రెండో ప్రతాపరుద్రుడిపైకి పంపాడు.
ఈ యుద్ధంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరి ప్రతాపరుద్రుడు ముబారక్ షా సామంతుడిగా ఉండటానికి అంగీకరించాడు.
నాలుగు, ఐదో దండయాత్రలు (1323)
ఘియాజుద్దీన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ అయిన తర్వాత అతడి కుమారుడు ఉలూఘ్ఖాన్ (జునాఖాన్) నేతృత్వంలో సైన్యాన్ని 1323లో వరంగల్పైకి పంపాడు.
మొదటి ప్రయత్నంలో ఉలూఘ్ఖాన్ కాకతీయ సేనల చేతిలో ఓడిపోయాడు.
కానీ తన తండ్రి ఆదేశాల ప్రకారం అదే ఏడాది ఓరుగల్లుపై రెండోసారి దండెత్తాడు. రెండో ప్రతాపరుద్రుడు, అతడి సైన్యాలు పోరాడినప్పటికీ చివరికి ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు.
ప్రతాపరుద్రుడు బందీగా చిక్కాడు. వరంగల్ కోట, దాని సిరిసంపదలు ఢిల్లీ సేనల దాడికి గురయ్యాయి.
ప్రతాపరుద్రుడిని ఎక్కువ రోజులు వరంగల్లోనే ఉంచితే, అతడిపై అభిమానంతో ప్రజలు తిరుగుబాటు చేయవచ్చని ఆలోచించిన ఉలూఘ్ఖాన్ అతడిని ఢిల్లీకి పంపేశాడు.
సుల్తాన్ సైన్యం ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి తీసుకెళ్తుండగా దారిలో సోమోద్భవ (నర్మద) నదీ తీరంలో మరణించాడని ముసునూరి ప్రోలయ నాయకుడి (1330) విలాస దానపత్ర శాసనం తెలుపుతుంది.
ప్రతాపరుద్రుడు సహజంగా మరణించలేదని, స్వచ్ఛందంగానే భగవదైక్యం చెందాడని 1423లో రెడ్డిరాణి అనితల్లి వేయించిన కలువచేరు తామ్ర శాసనం తెలుపుతుంది.
ప్రతాపరుద్రుడు స్వాభిమాని అయిన రాజు తన నిర్బంధ జీవితంలోని మార్పులకు, అతడు రాజీపడలేక అవమానం కంటే మృత్యువే మేలని భావించి మరణించాడు.
ఈ విధంగా రెండో ప్రతాపరుద్రుడి మరణంతో కాకతీయ వంశం అంతరించింది. తెలంగాణ, ఓరుగల్లు ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి.
ఓరుగల్లు సుల్తాన్పూర్గా పేరు మార్చారు.
రుద్రమదేవి (1262-89)
గణపతి దేవుడికి కుమారులు లేకపోవడంతో తన కుమార్తె రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు పేరుతో సింహాసనాన్ని అధిష్టింపజేశాడు.
రుద్రమ దేవి దక్షిణ భారతదేశంలో ఏకైక, తొలి మహిళా పాలకురాలు. ఈమె అత్యంత ప్రతిభావంతురాలైన పరిపాలనావేత్తగా, వీరనారీగా పేరు గడించింది.
ఈమె పరిపాలనా విశేషాలను అనేక శాసనాలు, సాహిత్యాలు వివరిస్తున్నాయి. వెనిస్ యాత్రికుడైన మార్కోపోలో ఈమె కాలంలో మోటుపల్లి ఓడరేవును సందర్శించి రుద్రమదేవి శక్తి సామర్థ్యాలు, ఓడరేవు వద్ద రుద్రమదేవి చేయించిన ఏర్పాట్లను ఎంతో ప్రశంసించారు.
రుద్రమదేవి రాజ్యానికి వచ్చిన సమయంలో రాజ్యంలో జరిగిన అలజడులను సేనాని రేచర్ల ప్రసాదిత్యుడు అణచి రుద్రమదేవికి అండగా నిలిచాడు.
ఇతడికి రుద్రమదేవి ‘కాకతీయ రాజ్యస్థాపనాచార్య, రాయపితామహాంక’ బిరుదులను ఇచ్చింది.
రుద్రమదేవికి అండగా నిలిచిన అధికారుల్లో కాయస్థ జన్నిగదేవుడు, కాయస్థ త్రిపురారి, మల్యాల గుండియ నాయకుడు, మాదయ నాయకుడు, మహా ప్రధాన కందర నాయకుడు మొదలైనవారు ఉన్నారు.
ఏకామ్రనాథుడి ప్రతాప చరిత్ర ప్రకారం రుద్రమదేవి సింహాసనం అధిష్టించగానే ఆమె సవతి తమ్ములైన హరిహర, మురారి దేవులు ఆమెకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దీనిని రుద్రమ తన సమర్థులైన సేనాధిపతుల అండతో అణచివేసింది.
తూర్పు గాంగ వంశ రాజైన మొదటి భానుదేవుడి దండయాత్రను రుద్రమదేవి సేనాధిపతులైన పోతినాయకుడు, ప్రోలియనాయకుడు తిప్పికొట్టారు.
దీంతో కాకతీయ, గాంగ రాజ్యాల మధ్య గోదావరి నది సరిహద్దు అయింది. రుద్రమదేవి అధికారం కోస్తా ఆంధ్ర ప్రాంతాలపై పునరుద్ధరించబడింది.
ద్రాక్షారామం గుడిలో లభించిన శాసనాలు ఈ విషయాన్ని సమర్థిస్తున్నాయి.
కాకతీయ రాజ్యంపై దండెత్తిన యాదవ మహాదేవుడిని ఎదుర్కొని శత్రుసేనలను దేవగిరి వరకు తరిమికొట్టి రుద్రమదేవి యాదవ రాజ్యంపై విజయం సాధించింది.
ఈ విజయంలో రుద్రమదేవి సేనాధిపతి సింధభైరవుడు ముఖ్యపాత్ర పోషించాడు.
బీదర్ కోటలో లభించిన రుద్రమదేవి శాసనం ఈ విజయాన్ని వర్ణిస్తుంది. ఈ విధంగా రుద్రమదేవి యాదవ రాజుపై సాధించిన చరిత్రాత్మక విజయానికి గుర్తుగా ‘రాయగజ కేసరి’ అనే బిరుదును ధరించింది. వరంగల్ కోటలోని స్వయంభూ ఆలయానికి రంగమండపం కట్టించింది.
బీదర్ కోట శాసనంలో కూడా రాయగజ కేసరి బిరుదు ఉంది.
రుద్రమదేవి పరిపాలనా కాలం చివరి దశలో సామంతుడు కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు లేవదీశాడని అతడి త్రిపురాంతకం, నందలూరు శాసనాలు తెలుపుతున్నాయి.
రుద్రమదేవి అతడి తిరుగుబాటును అణచేక్రమంలో చందుపట్ల (నల్లగొండ జిల్లా) వద్ద జరిగిన యుద్ధంలో మరణించింది.
1289, నవంబర్ 27 నాటి చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి ఆమె సేనాని మల్లికార్జున రాయలు అంబదేవుడిని అణచే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారని, ఈ శాసన నిర్మాత పువ్వుల ముమ్మడి (మల్లికార్జునుడి సేవకుడు) తన యజమాని ఆత్మశాంతి కోసం చందుపట్ల గ్రామంలోని సోమనాథ దేవుడి ఆలయానికి కొంత భూమిని దానం చేశాడని తెలుస్తుంది.
ప్రాక్టీస్ బిట్స్
Answers
1-1, 2-2, 3-3, 4-1, 5-4
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006