‘తెలుగులో వచ్చిన గొప్ప సినిమా ఇదని గర్వంగా చెప్పుకొనేలా ఉంటుంది. ప్రేక్షకులందరిని కొత్త లోకంలో విహరింపజేస్తుంది’ అని అన్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హసిత్ గోలి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ నెల 19న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. అనిల్ రావిపూడి బిగ్ టికెట్ను విడుదలచేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘హీరో వెంకటేష్కు నేను వీరాభిమానిని. ఆయన నటించిన ‘నారప్ప’ చిత్రం ఓటీటీలో విడుదలకావడంతో చాలా బాధపడ్డా. థియేటర్ల దుస్థితి నా మనసును కలిచివేసింది. సెకండ్వేవ్ తర్వాత మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్కు వస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడొస్తున్న సినిమాల్ని ఆదరిస్తేనే భవిష్యత్తులో స్టార్స్ చిత్రాలు విడుదలవుతాయి.
థియేటర్కు వచ్చే ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్వించే చిత్రమిది’ అని తెలిపారు. ‘ జయాపజయాలకు అతీతంగా కొత్త కథలను ఎంచుకుంటూ శ్రీవిష్ణు తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అతడి కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలవాలి’ అని అనిల్ రావిపూడి చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని అందరినీ నమ్మించే ఓ దొంగ కథ ఇదని, శ్రీవిష్ణును హీరోగా కొత్త పంథాలో ఆవిష్కరిస్తుందని దర్శకుడు హసిత్ పేర్కొన్నారు. సీరియస్ పాత్రలతో పాటు వినోదభరిత కథలకు శ్రీవిష్ణు న్యాయం చేయగలడని మరోసారి నిరూపించే చిత్రమిదని నారా రోహిత్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు బాబీ, వివేక్ ఆత్రేయ, కథానాయికలు మేఘాఆకాష్, సునయన తదితరులు పాల్గొన్నారు.