ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను డాల్బీ థియేటర్ వేదికపై లైవ్ పర్ఫార్మ్ చేసి స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ. ఆస్కార్ వేడుక అనంతరం ఇటీవల ఈ గాయకులిద్దరూ హైదరాబాద్ తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ సినీ దిగ్గజాల మధ్య ‘నాటు నాటు’ లైవ్ పర్ఫార్మెన్స్ తాలూకు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు రాహుల్ సిప్లిగంజ్.
ప్రపంచంలోని ఏ కళాకారుడికైనా ఆస్కార్ వేదికపై ఆడిపాడాలని ఉంటుందని..‘నాటు నాటు’ పాటతో తన కలనిజమైందన్నారు. పాట అనంతరం లభించిన స్టాండింగ్ ఒవేషన్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, అదొక మరపురాని అనుభమని రాహుల్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ పాట కోసం నాలుగు రోజుల పాటు రిహార్సల్ చేశాం. స్టేజీ ముందు నా గురువు కీరవాణి, రాజమౌళిగారు మా ప్రదర్శన చూస్తున్నారనే విషయం మరింత ఆనందాన్నిచ్చింది. ఎక్కడా తప్పులు దొర్లకుండా ‘నాటు నాటు’ పాటను రీక్రియేట్ చేయాలనుకున్నాం. లైవ్ పర్ఫార్మెన్స్కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి’ అన్నారు.
ఆస్కార్ పురస్కారాల సందర్భంగా తొమ్మిదిసార్లు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ప్రఖ్యాత సింగర్ రిహానాను కలుసుకొని ఫొటో దిగడం జీవిత కాల అనుభవమని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు. ‘అంతటి పేరుప్రఖ్యాతులున్నా ఆమెలో కించిత్ గర్వం కనిపించలేదు. ఫొటో దిగిన అనంతరం ‘నాటు నాటు’ పాట చాలా బాగుందని మెచ్చుకుంది’ అని రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు.