‘మది నిండా స్వచ్ఛమైన ప్రణయానురాగాల్ని ప్రోది చేసుకొని చారిత్రక యూరప్ పురవీధుల్లో ఉల్లాసభరితంగా విహరించే ప్రేమికుల జోడీ విక్రమాదిత్య, ప్రేరణ. 1970 దశకంలో సాగే ఈ జంట ప్రేమాయణం వెండితెరపై కన్నులపండువగా అనిపిస్తుంది. ప్రేమకు సరికొత్త అర్థాన్ని అందించే వీరిద్దరి వింటేజ్ ప్రేమాయణాన్ని తెరపై వీక్షిస్తే అదొక జీవితకాల అనుభవం’ అని చెప్పారు రాధాకృష్ణకుమార్. ఆయన దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం కృష్ణాష్టమిని పురస్కరించుకొని కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్, పూజాహెగ్డే ట్రెండీ లుక్స్తో దర్శనమిస్తున్నారు. ‘1970 దశకంలో జరిగే ప్రేమకథ ఇది. ఇటలీ, జార్జియా, హైదరాబాద్లలో చిత్రీకరణ జరిపాం. గ్రాఫిక్స్ అలరిస్తాయి. ప్రభాస్, పూజాహెగ్డే జోడీ చూడముచ్చటగా అనిపిస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది. యు.వి.కృష్ణంరాజు సమర్పిస్తున్న ఈ చిత్రానికి వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.