గత ఏడాది విడుదలై దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న ‘పుష్ప’ చిత్రం ఈ నెల 8న రష్యాలో విడుదలకాబోతున్న విషయం తెలిసిందే. గురువారం మాస్కోలో రష్యన్ లాంగ్వేజ్ ప్రీమియర్షోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, నాయిక రష్మిక మందన్న హాజరయ్యారు. ప్రీమియర్ షోకు ముందు అల్లు అర్జున్ రష్యన్ మీడియాతో ముచ్చటించారు. ప్రస్తుతం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాలు అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.
‘ప్రపంచ దేశాల్లోని పౌరులందరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందించాలి. మనమంతా ఒకటే అనే భావనతో ప్రజలందరూ సమిష్టిగా కృషి చేస్తే మార్పుని తీసుకురావొచ్చు’ అని అల్లు అర్జున్ చెప్పారు. ‘పుష్ప’ చిత్ర బృందానికి మాస్కోలో సాదర స్వాగతం లభించింది. ఈ నెల 3న సెయింట్పీటర్స్బర్గ్లో కూడా ప్రీమియర్ షోకు ఏర్పాటు చేశారు.