తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ‘పుష్ప’ చిత్రానికి అద్వితీయ ఆదరణ లభిస్తుందన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వారు నిర్మించిన తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం హైదరాబాద్లో నిర్మాతలు పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 71 కోట్ల గ్రాస్ను రాబట్టింది. నైజాంలో 11.44 కోట్లు, కేరళలో రెండున్నర కోట్లు, హిందీలో 3.75 కోట్లు వసూళ్లను సాధించింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు పెద్ద విజయాన్ని కట్టబెట్టడం ఆనందంగా ఉంది. ఇండియాలోనే తొలిరోజు అత్యధికగ్రాస్ను రాబట్టిన చిత్రంగా నిలిచింది. విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. బన్నీ నటన, పాత్రచిత్రణ ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఐదు భాషల్లో అనుకున్న సమయంలో సినిమాను విడుదలచేయడం చాలెంజింగ్గా అనిపించింది ఈ క్రమంలో కొన్ని అవాంతరాలు ఎదురైనా పాజిటివ్ టాక్తో ఆ కష్టాలన్నీ మర్చిపోయాం. మలయాళంలో అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ను రాబట్టిన సినిమా ఇది. భవిష్యత్తులో సుకుమార్తో మా బ్యానర్లో మరిన్ని సినిమాలు చేస్తాం. మంచి సినిమాను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని మరోసారి ఈ విజయంతో నిరూపించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నుంచి ‘పుష్ప’ రెండో భాగం షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు.