Pushpa 2 | “పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ చూశా.. దాన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది.. అద్భుతం. దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ అవసరంలేదు. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్.” అని ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ఈ నెల 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అతిథిగా విచ్చేసిన రాజమౌళి పై విధంగా స్పందించారు.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ-“ ‘ఆర్య’తో నా కెరీర్ మొదలైంది. బన్నీ ఎదుగుదలను చూస్తూ ఇక్కడదాకా వచ్చాను. పుష్ప ఫ్రాంచైజీ ఇలా తయారైంది అంటే ఇది కేవలం బన్నీ మీద నాకున్న ప్రేమవల్లే. ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కోసం కూడా ఫైట్ చేసే తపన ఉన్న నటుడు బన్నీ. తన క్యారెక్టర్ చాలా గొప్పది. అతనితో పనిచేస్తుంటే తెలీని ఎనర్జీ. తను కష్టపడుతూ, అందరిలో స్ఫూర్తి నింపే గొప్ప వ్యక్తి.
ఈ సినిమాకు పనిచేసిన అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అది రేపు మీరు తెరపై చూస్తారు’ అని చెప్పారు. చివరిగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ ‘పుష్ప-2’ లాంటి సినిమా చేయడం మైత్రీవారికి మాత్రమే సాధ్యం. సాంకేతికంగా అందరూ ప్రాణం పెట్టి ఈ సినిమాకు పనిచేశారు. అందరం అయిదేళ్ల జీవితాన్ని పణంగా పెట్టి చేసిన సినిమా ఇది. ఇక ఇందులో నటీనటుల విషయానికొస్తే.. ఫహాద్ ఫాజిల్గారి నటన అద్భుతం. అయిదేళ్లుగా నేను పని చేసుస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ రష్మిక. అంత కష్టపడి పనిచేసే హీరోయిన్ని నేను చూడ్లేదు. ఇది పూర్తి సుకుమార్ సినిమా.
బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ఆయన చేసిన కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన పడిన కష్టం కోసమైనా ఈ సినిమా ఆడాలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చూసి అందరం గర్వించాం. ఈ సినిమా కూడా అందరం గర్వించేలా ఉంటుంది. పుష్పరాజ్ తప్పకుండా మీ మనసుల్ని తాకుతాడు’ అని అల్లు అర్జున్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా అల్లు అరవింద్, కథానాయికలు రష్మిక మందన్నా, శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, డీవోపి మిర్సలో క్యూబా బ్రోజెక్, కళాదర్శకులు రామకృష్ణలతోపాటు మలినేని గోపీచంద్, శివ నిర్వాణ, బుచ్చిబాబు సానా, వివేక్ ఆత్రేయ, అనసూయ భరద్వాజ్ ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు.