Puri Jagannadh | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా విస్తరించిందో చెప్పే ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దర్శకుడు పూరి జగన్నాథ్కు బ్యాంకాక్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో కేవలం “నేను ప్రభాస్ స్నేహితుడిని” అని చెప్పడంతో వీఐపీ ట్రీట్మెంట్ లభించిందని ప్రభాస్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీలో ఈ ఆసక్తికర సంఘటనను ప్రభాస్ అభిమానులతో పంచుకున్నారు. ‘బాహుబలి’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోజులలో పూరి జగన్నాథ్ ఓ చిన్న ఇన్ఫెక్షన్ చికిత్స కోసం బ్యాంకాక్లోని ఓ హాస్పిటల్ను సందర్శించారు.
వెయిటింగ్ రూమ్లో కూర్చున్న పూరిని చూసిన ఓ నర్స్ ఆయన ఇండియా నుంచి వచ్చారా అని అడిగింది. ఆయన అవునని చెప్పగానే, వెంటనే ‘బాహుబలి?’ అని ప్రశ్నించింది. దాంతో ఆశ్చర్యపోయిన పూరి, ఆమెకు ప్రభాస్తో కలిసి దిగిన ఓ వ్యక్తిగత ఫోటో చూపిస్తూ తాను ప్రభాస్కు సన్నిహిత మిత్రుడినని చెప్పారు.ఆ ఫోటో చూసిన నర్స్ వెంటనే ఆసుపత్రి సిబ్బందికి ఈ విషయం తెలియజేయగా, పూరికి ప్రత్యేక గౌరవం లభించింది. వెయిటింగ్ టైమ్ను రద్దు చేసి, నేరుగా ప్రత్యేక గదికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఈ అనుభవాన్ని పూరి జగన్నాథ్ వాయిస్ మెసేజ్ రూపంలో ప్రభాస్కు పంపగా, ఆ సమయంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఉన్న ప్రభాస్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారని డాక్యుమెంటరీలో వెల్లడించారు.
జపాన్లో ‘బాహుబలి’కి విశేష ఆదరణ ఉందనే విషయం తెలిసిందే. అయితే బ్యాంకాక్లోని ఓ సాధారణ హాస్పిటల్ సిబ్బంది కూడా ఈ చిత్రాన్ని గుర్తించడం చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచిందని సమాచారం. ఇక ఇదే డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి ‘బాహుబలి 3’పై పరోక్షంగా హింట్ ఇవ్వడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’, అలాగే ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ చిత్రాలు ఆయన లైనప్లో ఉన్నాయి.