ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో సైన్స్ ఫిక్షన్ కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీపికా పడుకోన్ నాయికగా నటిస్తున్నది. మరో కీలక పాత్రను దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో యుద్ధం జరుగుతున్న సన్నివేశం, వివిధ రకాల యుద్ధ వాహనాలు, భారీ చేతి ఆకారంపై ముగ్గురు వ్యక్తులు తుపాకి ఎక్కుపెట్టడం ఉంది. ఈ ఫొటో కింద ప్రపంచం ఎదురుచూస్తున్నది అనే క్యాప్షన్ రాశారు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు తెరపై మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అవుతుందని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా.