Producers Meeting at Telugu Film Chamber | జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ చేస్తామన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై సందిగ్ధత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఉదయం తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, సాయంత్రం నిర్మాతలు సమావేశంపై సమాలోచనలు చేశారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన సురేష్ బాబు, దిల్ రాజు, మైత్రీ రవి, సితార నాగవంశీ, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు సహా పలువురు అగ్ర నిర్మాతలంతా ఎగ్జిబిటర్ల డిమాండ్లపై చర్చించారు. ముఖ్యంగా పర్సంటేజ్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పర్సంటేజ్ విధానానికి ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. పాత పద్ధతిలోనే మొదటి వారం అద్దె విధానం, రెండో వారం పర్సంటేజ్ ప్రకారమే చెల్లిస్తామని వాదించారని సమాచారం. ఈ విషయంపై నిర్మాతల మధ్య వాడీవేడిగానే చర్చ కొనసాగినట్లు తెలుస్తోంది.
మరోవైపు మల్టీప్లెక్స్ల్లో పర్సంటేజ్ను ప్రోత్సహిస్తున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు… అత్యధిక వసూళ్లు, షేర్ ఇచ్చే సింగిల్ స్క్రీన్లపై ఎందుకు విస్మరిస్తున్నారు అనేది ఎగ్జిబిటర్ల ప్రధాన వాదన. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా మల్టీప్లెక్స్ల తరహాలోనే పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎగ్జిబిటర్ల డిమాండ్లపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 23న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సమావేశంలో అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఓ పరిష్కారానికి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చర్చల అనంతరం జూన్ 1 నుంచి థియేటర్ల బంద్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.