సినిమాకు హంగులు మాత్రమే సరిపోయే రోజులివి కాదని, మంచి కథలకే ప్రేక్షకాదరణ దక్కుతున్నదని, ఈ విషయంలో నిర్మాతలకు భయం పట్టుకుందని అంటున్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ఆయన నిర్మాణంలో సమంత టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘యశోద’. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ…‘సరోగసీ నేపథ్యంలో సాగే చిత్రమిది. కథ చెప్పినప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. నేను ఒకప్పుడు నిర్మించిన ‘ఆదిత్య 369’ సినిమా కథ విన్నప్పుడు ఎలాంటి ఉత్సుకత పొందానో ఈ సినిమా నెరేషన్ విన్నప్పుడూ అలాంటి అనుభూతే కలిగింది. ఇది ఇప్పటిదాకా తెరపై చూడని అంశం.
ఈ సినిమాకు సమంత ఇచ్చిన సహకారం మర్చిపోలేము. ఆమె ప్రాజెక్ట్లో ఎంతో ఇన్వాల్వ్ అయ్యింది. ఆరోగ్యం బాగా లేకున్నా, తెలుగు, తమిళంలో తనే డబ్బింగ్ చెప్పింది. ఆమె సహకారంతో నిర్మాతగా నాపై ఒత్తిడి తగ్గిపోయింది. దర్శకులు ముందు తక్కువ బడ్జెట్ అనుకున్నా కథ డిమాండ్ మేరకు బడ్జెట్ పెంచుకున్నాం. ఎలా సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకున్నామో..అలాంటి ఔట్పుట్ వచ్చింది. సోలో రిలీజ్ కావడం కూడా మాకు కలిసొచ్చే అంశం. ఇది స్ట్రైయిట్ తెలుగు సినిమా. మిగతా భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. నా దృష్టిలో స్టార్ హీరోల కాంబినేషన్ కంటే ఎంత కొత్త కథ ఎంచుకున్నాం అనేది ముఖ్యం. గత ఐదారు నెలలుగా నిర్మాతల్లో కథల విషయంలో భయం పట్టుకుంది. బాగా లేని సినిమాను ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. మధ్యాహ్నం ఆటకే కలెక్షన్స్ ఉండటం లేదు’ అన్నారు.