మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తొలివారంలో ఈ చిత్రం 212కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘విడుదలైన రోజు ఉదయం కొందరు సోషల్మీడియా ద్వారా మా సినిమాపై దుష్ప్రచారం చేసి ప్రేక్షకులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేశారు. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ రాకతో సాయంత్రానికి టాక్ మొత్తం మారిపోయింది.
ఈ సినిమా విజయానికి తొలివారంలో సాధించిన వసూళ్లే సాక్ష్యం. ఇందులో తల్లీకొడుకుల సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంటున్నది. అందుకే ఆ స్థాయి కలెక్షన్స్ వస్తున్నాయి’ అన్నారు. కొందరు కావాలనే తమ సినిమాను టార్గెట్ చేశారని, నెగెటివ్ రివ్యూలు సినిమా విజయంపై ఏమాత్రం ప్రభావం చూపలేదని నాగవంశీ తెలిపారు. ‘టైటిల్ చూసి ఇదొక పక్కా మాస్ సినిమా అనే భావన కొంతమందిలో కలిగింది. ఫ్యామిలీ సినిమా అనే విషయాన్ని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయాం.
అందుకే అభిమానులు ఏమైనా నిరాశచెందారేమో అనిపించింది. అయితే భారీ వసూళ్లతో మా అంచనాలు నిజమయ్యాయి. మహేష్బాబు కూడా మొదటి నుంచి ఈ సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నారు. నెగెటివ్ రివ్యూలు చూసి ఆయన ఏమాత్రం ఆందోళన చెందలేదు. రేపటి నుంచి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడండి అంటూ మాకు భరోసానిచ్చారు. ఆయన ఇచ్చిన ధైర్యమే ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణమైంది’ అని నాగవంశీ చెప్పారు.