‘ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్, చాట్ జీపీటీని అడుగుతున్నాం. బంధాలు, భావోద్వేగాలు, ఆరోగ్యం ఇలా అన్నింటికీ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. అసలు ఇంటర్నెట్ సమాచారం సరైనదేనా? ఇద్దరి మధ్య జరిగేది వారిద్దరికే తెలుస్తుంది కానీ, గూగుల్కీ, చాట్ జీపీటీకి తెలుస్తుందా? ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, 2040లో ఎలా ఉంటుంది? మనుషుల కంటే మిషన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. ఎవరి పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా మిషన్స్ చెబుతాయి. అలాంటి పరిస్థితిలో ఒక అప్లికేషన్ మనకు సరైన భాగస్వామి ఎవరో చెబితే? ఆ ప్రేమను నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధానాశం. ఈ సినిమాలో చెప్పిన అంశాలన్నీ కమర్షియల్గా, రిలేటబుల్గా ఉంటాయి’ అన్నారు హీరో ప్రదీప్ రంగనాథన్.
ఆయన హీరోగా నటించిన క్రేజీ లవ్స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. కృతిశెట్టి కథానాయిక. విఘ్నేష్ శివన్ దర్శకుడు. నయనతార నిర్మాత. ఎస్జే సూర్య, యోగిబాబు కీలకపాత్రధారులు. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడారు. అగ్ర నిర్మాత దిల్రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ ప్రయోగాత్మక చిత్రం అందరికీ కనెక్టయ్యేలా, అర్థమయ్యేలా ఉంటుందని దర్శకుడు విఘ్నేష్ శివన్ తెలిపారు. ఈ సినిమాలో నటించడం పట్ల కథానాయిక కృతిశెట్టి ఆనందం వెలిబుచ్చింది.