ఐదేళ్ల క్రితం మొదలైన మీటూ ఉద్యమం వివిధ రంగాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను వెలుగులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా సినీ రంగంలోని చాలా మంది కథానాయికలు తాము ఎదుర్కొన్న వేధింపులపై ధైర్యంగా గళాన్ని వినిపించారు. దీనివల్ల ఇండస్ట్రీలో పనిచేసే మహిళల్లో భరోసా పెరిగింది. తాజాగా ఈ విషయం గురించి స్పందించింది తమిళ కథానాయిక ప్రియా భవానీ శంకర్. ప్రతీ రంగంలో నిత్యం ఎక్కడో ఓ చోట లైంగిక వేధింపుల మాట వినిపిస్తున్నదని, ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా మహిళలు ధైర్యంగా వాటిని బయటపెట్టాలని కోరింది.
సమాజం కూడా లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతున్న మహిళలకు అండగా నిలిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘లైంగిక వేధింపుల గురించి మాట్లాడేవారిని కొందరు చిన్నచూపు చూస్తుంటారు. ఎప్పుడో జరిగిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడటమేంటని పెదవి విరుస్తుంటారు. ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల మహిళలు అభద్రతాభావానికి గురవుతారు. సంఘటన ఎప్పుడు జరిగినా దానికి మద్దతుగా ప్రజలు నిలిస్తేనే న్యాయం జరుగుతుంది’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ కమల్హాసన్ సరనసన ‘ఇండియన్-2’చిత్రంలో నాయికగా నటిస్తున్నది.