కెరీర్ ఆరంభం నుంచి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్తో సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. నాగార్జున కథానాయకుడిగా ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు ప్రవీణ్ సత్తారు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి…
‘ది ఘోస్ట్’ అనే పదం అపరాధ పరిశోధన, ఇంటిలిజెన్స్ ఫీల్డ్స్లో చాలా సు పరిచితమైనది. దానికొక పవర్ ఉంది. ఘోస్ట్ ప్రోటోకాల్ అని అంటారు. ఈ సినిమాలో కథానాయకుడికి అండర్వరల్డ్ పెట్టిన పేరు ఘోస్ట్. నాగార్జునగారి కోసమే ఈ కథ రాసుకున్నా. నా కెరీర్లో హీరోకి కథ రాసుకోవడం ఇదే తొలిసారి. నాగార్జునగారి ైస్టెల్, లుక్స్, స్క్రీన్ప్రజెన్స్ను దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్ను డిజైన్ చేశాం. ఈ కథలో పవర్ఫుల్ యాక్షన్తో పాటు హృదయాన్ని కదిలించే ఎమోషన్ ఉంటుంది.
యాక్షన్ సీక్వెన్స్ హైలైట్
నాగార్జునగారు ఈ సినిమాలో నలభై ఏళ్ల ఇంటర్పోల్ ఆఫీసర్గా కనిపిస్తారు. ఈ సినిమాలో తమహగనే కత్తి నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. మొత్తం 12 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. క్లాస్గా తీసిన పక్కా మాస్ సినిమా ఇది. నా దృష్టిలో సినిమా తీయడం అంటే సినిమా అనే బుక్లో ఓ పేజీ రాయడం. ది ఘోస్ట్ అనేది ఓ పేజీ. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ పేజీ ఉంటుంది. అందుకే సినిమా పేజీలో ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా రాయాలి. ఆ భయం ఉంటే ప్రతి సినిమా బాగుంటుంది. నా తదుపరి చిత్రాన్ని వరుణ్తేజ్తో చేస్తున్నా. ఈ నెల 10 నుంచి యూకేలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓ వెబ్సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నా.