సినిమాల్ని వీక్షించే విషయంలో దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచులు పూర్తి భిన్నంగా ఉంటాయని చెప్పింది కన్నడ సోయగం ప్రణీత. ఈ మధ్యనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు సినిమాల జోరును కూడా పెంచింది. కన్నడ, తెలుగు భాషల్లో ఒకప్పుడు అగ్రనాయికగా అలరించిన ఈ భామ ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్ వైపు మరల్చింది. హంగామా-2, భుజ్-ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాలతో మంచిగుర్తింపును సంపాదించుకుంది. అయితే బాలీవుడ్లో తాను నటించిన చిత్రాలు ఓటీటీలో విడుదలకావడం కాస్త నిరాశకు గురిచేసిందని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘దక్షిణాది ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమాల్ని ఆస్వాదించడాన్ని బాగా ఇష్టపడతారు. ఉత్తరాదిలో ఇందుకు కాస్త భిన్నంగా ఉంటుంది’ అని చెప్పింది. హిందీ చిత్రసీమలో కమర్షియల్ సినిమాల నాయికగా ఎదగడమే తన లక్ష్యమని వివరించింది. ‘కన్నడ, తెలుగు భాషల్లో నాకు వాణిజ్య చిత్రాలే పేరు తెచ్చాయి. బాలీవుడ్ను నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నా. ఇక్కడ కూడా కమర్షియల్ చిత్రాలే చేయాలనుంది. ప్రస్తుతం భాషాహద్దులు చెరిగిపోతున్నాయి. ప్రాంతీయ భాషా చిత్రాలు జాతీయ స్థాయిలో మెప్పిస్తున్నాయి’ అని చెప్పుకొచ్చింది ప్రణీత.