Villain Pran | సినిమాలకు హీరోనే ప్రాణం. సినిమా నిర్మాతకు హీరోయే ముఖ్యుడు. హీరో ఎవరని కూడా సినిమా చూసే ప్రేక్షకులుంటారు. సాధారణంగా సినిమా నిర్మాణంలో కూడా హీరోకే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. కానీ అక్కడక్కడ హీరో కంటే విలన్ లకు, దర్శకులకూ ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. అలాంటి వారు బాలీవుడ్లోనైనా, టాలీవుడ్లోనైనా ఉంటారు. బాలీవుడ్లో ప్రముఖంగా విలన్ పాత్రలు వేసి సినిమాకే వన్నె తెచ్చే నటుల్లో ప్రాణ్ ఒకరు. ఆయన ఒకప్పుడు హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారు. ప్రేక్షకులు కూడా అతన్ని చూసి నిజమైన విలన్ అనుకునే వారు. అతన్ని చూసి ప్రజలు పారిపోయిన సంఘటనలూ ఉన్నాయి. అంటే విలన్ గా అంత చక్కటి అభినయం ప్రదర్శించేవాడు.
బాలీవుడ్లో అత్యంత భయంకరమైన విలన్ గా పేరొందిన ప్రాణ్ 104వ జయంతి ఈ రోజు. 1920 ఫిబ్రవరి 12న ఢిల్లీలో జన్మించారు. తండ్రి లాలా కేవల్ కృష్ణ సికంద్ ఓ చిన్న కంట్రాక్టర్. లాలా కేవల్ కృష్ణ సికంద్కు మొత్తం ఏడుగురు పిల్లలు. దేశ విభజనకు ముందు ఫోటోగ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన అతడు పనిమీద ఒకరోజు లాహోర్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే అతనికి అనుకోకుండా సినిమాల్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది. అలా ప్రాణ్, ఏడు దశాబ్దాల పాటు సాగిన తన నట జీవితంలో,ఎన్నో మరపురాని పాత్రలను పోషించాడు, ప్రజలు అతన్ని నిజ జీవితంలో కూడా విలన్గా పరిగణించడం ప్రారంభించారు. 362 సినిమాల్లో భాగమైన ప్రాణ్కి పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి గౌరవాలు లభించాయి.
అతను లాహోర్ సినిమా నుండి నటించడం ప్రారంభించాడు. భయంకరమైన విలన్ పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించాడు. కెరీర్లో టాప్లో ఉన్నప్పుడు విభజన గొడవలు అతడి కెరీర్కు ముగింపు పలికాయి. దాంతో మళ్ళీ అతను హిందీ చిత్ర పరిశ్రమలో మళ్ళీ జీరో నుండి ప్రారంభించాల్సి వచ్చింది. ఈరోజు, ప్రాణ్ పుట్టినరోజు సందర్భంగా, అతని నటన, వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటనలు తెలుసుకుందాం..
ప్రాణ్కి సిగరెట్ అంటే చాలా ఇష్టం. అతను 12 ఏండ్ల వయస్సులో సిగరెట్ తాగడం ప్రారంభించాడు. ఒక రోజు, అతను సిగరెట్ తాగడానికి లాహోర్లోని ఒక పాన్ షాప్కి వెళ్ళినప్పుడు, అక్కడ స్క్రిప్ట్ రైటర్ వలీ మహ్మద్ వలీని కలిశాడు. వలీ మొహమ్మద్ అతనికేసి తీక్షణంగా చూసింతరువాత ప్రాణ్తో `నేను ఒక సినిమా చేస్తున్నాను, అందులో ఒక పాత్ర సరిగ్గా నీలాగే ఉంటుంది` అని అన్నారు. ఆ తరువాత, అతను తన చిరునామాను ఒక కాగితంపై వ్రాసి ప్రాణ్కి ఇచ్చి, మరుసటి రోజు కార్యాలయానికి వచ్చి కలవమని చెప్పాడు. కాని ప్రాణ్, అతన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఆ పేపర్ను పట్టించుకోలేదు.
కొద్ది రోజుల తర్వాత మళ్లీ వలీ మహమ్మద్ ప్రాణ్ ని కలిసినప్పుడు ..తాను గతంలో కలిసి తన ఆఫీసుకు రమ్మన్న సంగతి గుర్తు చేశాడు. ప్రాణ్ అయిష్టంగానే ఎందుకు తనను ఎందుకు ఆఫీసుకు రమ్మంటున్నారని వలీని అడిగాడు. వలి మహ్మద్ తానో సినిమా తీస్తున్నాని చెప్పాడు. అప్పుడు కూడా ప్రాణ్ అతని మాటలను అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ వస్తాలే అన్నాడు. చివరకు ప్రాణ్ వెళ్ళి వలీ మొహమ్మద్ని కలిసినప్పుడు సినిమాలో నటించటానికి ఒప్పించాడు. ఈ విధంగా, ప్రాణ్ తన కెరీర్లో పంజాబీలో చేసిన మొదటి చిత్రం యమ్ లా జట్లో కనిపించాడు. ఈ కారణంగా ప్రాణ్ ఎప్పుడూ వలీని తన గురువుగా భావించేవాడు.
స్వాతంత్రానికి ముందు లాహోర్లోనే ఉన్న ప్రాణ్ 1947 వరకు సినిమాలు చేశాడు. 1940 నుంచి 1947 మధ్య, ప్రాణ్ 22 చిత్రాలలో పనిచేశాడు. లాహోర్ చలనచిత్ర పరిశ్రమలో వివిధ సినిమాల్లో నటించిన ప్రాణ్ క్రూరమైన విలన్ పాత్రలో నటించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 1947లో దేశానికి స్వాతంత్ర్యం రావడంతో అల్లర్లు మొదలయ్యాయి. ఢిల్లీ నుంచి లాహోర్ వరకు అవే అల్లర్లు. అల్లర్లలో తన కుటుంబానికి ఏదైనా జరుగుతుందని భయపడి లాహోర్లో పనిచేస్తున్న ప్రాణ్ తన ఏడాది వయసున్న కుమారుడు అరవింద్తో భార్య శుక్లా అహ్లూవాలియాను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉండే తన కోడలు వద్దకు పంపాడు.
1947 ఆగస్టు 11న, లాహోర్ లో ఉన్న ప్రాణ్ తన కొడుకు పుట్టినరోజు జరుపుకోవడానికి ఇండోర్ వచ్చాడు. ఇక్కడికి వచ్చి లాహోర్ లో జరిగిన అల్లర్లతో అల్లకల్లోలంగా మారిందని, అక్కడ హిందువులను సెలెక్టివ్గా చంపేస్తున్నారని , ఇండ్లన్ని ఆందోళనకారులు కాలబెట్టారని రేడియోలో వార్తల్లో విన్న తర్వాత, ప్రాణ్ ఇక లాహోర్ కు తిరిగి వెళ్ళకుండా ఇండోర్ లోనే ఉండిపోయాడు.
1945లో కోల్కతా చిత్ర పరిశ్రమ పూర్తిగా ముంబైకి మారింది. అతనికి నటన తప్ప ఏదీ ఎరగడు. దాంతో ముంబై చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని ఎందుకు పరీక్షించుకోకూడదనుకున్నాడు. లాహోర్లో తనకు గుర్తింపు ఉండేది. కాబట్టి ఇక్కడ కూడా ఆ గుర్తింపుతో పని పొందడానికి అవకాశం ఉంటదనుకున్నాడు. ఆ నమ్మకంతో కుటుంబ సమేతంగా ముంబైకి వచ్చాడు. ఆయన ఆశించినట్లేమీ జరుగలేదు. ముంబైకి వచ్చి పని వెతుక్కుంటూ చాలా మంది నిర్మాతలు, దర్శకుల కార్యాలయాలకు వెళ్లినా ఫలితం లేకపోయింది.
ఆయన నటించిన జిద్ది సినిమా హిట్ అయ్యింది. ఆ తర్వాత ప్రాణ్కి మరో 3 సినిమాల ఆఫర్లు వచ్చాయి. అలాగే ఆయన ప్రతి సినిమాకు రూ. 500 తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. హీరోలు కూడా అంత ఎక్కువ ఫీజులు వసూలు చేసేవారు. ఈ విధంగా, అతను హీరోలు కంటే, ఇతర విలన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే విలన్గా మారాడు.
ఒకసారి వచ్చిన ఆఫర్ ప్రకారం ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు.కానీ సినిమా హీరోకి చెల్లించే రుసుము రూ.500 చెల్లించలేనని నిర్మాత చెప్పాడు. దాంతో ప్రాణ్ ఆ సినిమా చేయడానికి నిరాకరించాడు.ఆ తర్వాత మరో రూ.100 అదనంగా చెల్లించి నిర్మాత అతడిని తన సినిమాలోకి తీసుకున్నాడు. ఈ విధంగా ఆ సినిమాకు హీరో కంటే నెలకు రూ.600 ఎక్కువ ఫీజు అందుకున్నాడు. ఆ తర్వాత ప్రాణ్ చాలా సినిమాల్లో హీరో కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేశాడు. 1948లో గృహస్తి సినిమా విడుదలైంది. ఈ సినిమా కోసం ప్రాణ్ నెలకు రూ.1000 తీసుకున్నాడు.
ప్రాణ్ తన మేకప్ విషయంలో చాలా కాన్షియస్ గా ఉండేవాడు. వార్తాపత్రికలో ప్రచురితమైన ఏ నేత ఫోటో తనకు నచ్చినా దాన్ని కత్తిరించి ఉంచుకునేవాడు. సినిమాలో స్క్రీన్పై తనను తాను చూపుకునే అంశంపై ఎలాంటి లోటు రాకూడదని ఇలా చేసేవాడు. ప్రాణ్ తన ఇంట్లో మేకప్ వస్తువులను కూడా ఉంచేవాడు. ఖాన్ దాన్ సినిమాలో హిట్లర్ లుక్ ని కాపీ కొట్టాడు. జుగ్నులో అతను బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ గెటప్ను కాపీ చేసాడు. అందులో అతను ప్రొఫెసర్ పాత్రలో కనిపించాడు. అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలో అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గెటప్ని ఎంచుకున్నాడు.
విలన్ పాత్రల వల్ల ప్రాణ్ను ప్రజలు అతనిని వీధుల్లోనే తిట్టేవారు. ప్రజలు తమ పిల్లలకు ప్రాణ్ అని పేరు పెట్టడం కూడా మానేశారు. ‘ఉప్ కార్’కి ముందు, నన్ను రోడ్డు మీద చూసినప్పుడు ప్రజలు నన్ను దుష్టుడు, గూండా, రౌడీగా అని పిలిచేవారు` అని ప్రాణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ రోజుల్లో అతను తెరపై కనిపించగానే పిల్లలు అమ్మ ఒడిలో కూచుని చీరలో ముఖం దాచుకునేవారు. పిల్లలు ఏడ్చుకుంటూ మమ్మీ, అతను వెళ్లిపోయాడా? కళ్ళు తెరవాలా? అని అడిగే వారట.
ప్రాణ్ ఎప్పుడూ ఇతరులతో స్నేహంగా ఉండేవాడు. సెట్పైకి రాగానే అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. ఉప్ కార్ సినిమా షూటింగ్ సమయంలో ప్రాణ్ సాయంత్రం వరకు ఎవరితోనూ మాట్లాడలేదు. ఆరోజు సినిమాలో ఫైట్ సీన్ షూట్ చేయాల్సి ఉంది. సెట్కు చేరుకున్న ప్రాణ్ ఎవరితోనూ మాట్లాడ లేదు.సినిమాలో హీరో మనోజ్ కుమార్కి ఇది వింతగా అనిపించింది. బహుశా ప్రాణ్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడంలో బిజీగా ఉండవచ్చు అని అనుకున్నాడట. ప్రాణ్ ఆ రెండో రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎవరితోనూ మాట్లాడకుండా దిగులుగా కూర్చున్నాడట. ఇది చూసిన మనోజ్ కుమార్ బహుశా అలసిపోయాడేమో అనుకున్నాడు కానీ ప్యాకప్ తర్వాత కూడా ఎవరితోనూ మాట్లాడక పోవడంతో మనోజ్ కుమార్ ఆపుకోలేక ప్రాణ్ ని కారణం అడిగాడట.
`నేను నిన్న రాత్రి షూటింగ్ ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు, కోల్కతా నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. మా చెల్లి చనిపోయిందని తెలిసింది` అంటూ ఏడవడం మొదలుపెట్టాడట. ఇది విన్న మనోజ్ కుమార్ తన సోదరి అంత్యక్రియలకు ఎందుకు వెళ్లలేదని అడిగాడు. దానికి సమాధానంగా ప్రాణ్ మాట్లాడుతూ `మీరందరూ నన్ను వెళ్లమని అంటారని నాకు తెలుసు` అయితే కొన్ని రోజులు షూటింగ్ ఆపేయడం వల్ల చాలా ఖర్చు అవుతుంది. సినిమా మేకింగ్లో చాలా డబ్బు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నిర్మాతకు నష్టం వస్తుంది` అని తాను వెళ్ళలేదని చెప్పాడు. ఈ మాటలు విన్న మనోజ్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు.
ఉపకార్ చిత్రానికి సంబంధించి మరో కథ కూడా ఉంది. ఆ చిత్రానికి ముందు, నిజ జీవితంలో ప్రజలు ప్రాణ్ను నిజమైన రౌడీగానే భావించేవారు. ఆ విషయం అతని కూతురికి నచ్చలేదు. కూతురు అతనితో నువ్వు హీరోలా మంచి మంచి పాత్రలు ఎందుకు చేయ్యవని అడిగింది. దాంతో కుమార్తె అడిగిన విషయం అతన్ని ఆలోచనలో పడేసింది. ఇకపై మంచి పాత్ర చేయాలని నిర్ణయించుకుని వచ్చాడట ప్రాణ్. ఇంతలో, మనోజ్ కుమార్ ఉప్కార్ సినిమా స్క్రిప్ట్ తో అతని దగ్గరకు వచ్చాడు. దీని కథను మనోజ్ కుమార్ స్వయంగా రాశారు. కథ రాసేటప్పుడు ప్రాణ్ని దృష్టిలో పెట్టుకుని మలంగ్ చాచా పాత్రను రాసుకున్నాడు. కథ విన్న ప్రాణ్ ఆ పాత్ర చేయడానికి అంగీకరించాడు. ఆ చిత్రంలోని ప్రముఖ పాట ..కస్మే వాదే.. ప్రాణ్పై చిత్రీకరించారు.
ఈ పాటను ప్రాణ్పై చిత్రిస్తారని తెలియగానే.. సంగీత దర్శకులు కళ్యాణ్జీ – ఆనంద్జీ మా పాటను పాడు చేస్తాడని అరవడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆ పాటను కిషోర్ కుమార్ పాడేందుకు నిరాకరించారు. కానీ ఆ పాట ఫస్ట్ ప్రింట్ చూసిన వారంతా ప్రాణ్ నటన చూసి ఆశ్చర్యపోయారు. దాంతో అందరికి ప్రాణ్ పై నమ్మకం కలిగింది. ఆయన ఏ క్యారెక్టర్కైనా న్యాయం చేస్తాడని విశ్వాసం కలిగింది.
ఉప్ కార్ విడుదలైన వెంటనే ఓం ప్రకాష్ కూతురు పెళ్లి కోసం ప్రాణ్ ఢిల్లీ వెళ్లాడు. అతను తన కారును 400 గజాల దూరంలో పార్క్ చేసి పెవిలియన్కు వెళ్లాలి. అతను తన కారు నుండి బయటకు రాగానే, అక్కడ ఉన్న అభిమానులు – మలంగ్ మామయ్య వస్తున్నారు అని తప్పుకోండి అని అనడం ప్రారంభించారు. ఇది విన్న ప్రాణ్ ఉద్వేగానికి లోనై రాత్రికి రాత్రే నా గురించి మనుషుల ఆలోచనల్లో వచ్చిన మార్పు చూసి నేను ఆశ్చర్యపోయానని అన్నాడు.