‘మా’ ఎన్నికల రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ నెల 10న ఎన్నికలు జరగనుండగా అధ్యక్షులుగా పోటీ చేస్తున్న ప్రకాష్రాజ్, మంచు విష్ణు ప్యానెల్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మంగళవారం మంచు విష్ణు ప్యానెల్పై ప్రకాష్రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో విష్ణు ప్యానెల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని, ఏజెంట్ల ద్వారా కుట్రకు తెరలేపారని ప్రకాష్రాజ్ ఆరోపించారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం ప్రకాష్రాజ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అరవైఏళ్ల పైబడిన సభ్యుల సౌకర్యార్థం పోస్టల్ బ్యాలెట్ విధానానికి మేమంతా సమ్మతిని తెలియజేశాం. కరోనా సమయం కాబట్టి ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఓటు వేయలేని వారికి ఉపయుక్తంగా ఉంటుందని భావించాం. అయితే విష్ణు ప్యానెల్ పోస్టల్ బ్యాలెట్ విషయంలో కుట్ర చేస్తున్నారు. సభ్యుల వద్దకు వాళ్ల మనుషులు వెళ్లి సంతకాలు తీసుకొని..ఇక్కడకు వచ్చి వాళ్లే డబ్బులు కడుతున్నారు.
సోమవారం రోజున విష్ణు తరపున ఓ వ్యక్తి 56 మంది సభ్యులకు సంబంధించి ఇరవై ఎనిమిదివేల రూపాయలు కట్టారు. దానికి ‘మా’ ఎన్నికల అధికారి రిసిప్ట్ కూడా ఇచ్చారు. కృష్ణ, కృష్ఱంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్బాబు, లక్ష్మితో పాటు మరికొందరు ఆర్టిస్టుల డబ్బులు కూడా మంచు విష్ణు కంపెనీకి సంబంధించిన వ్యక్తే కట్టారు’ అని ప్రకాష్రాజ్ తెలిపారు. అసహ్యంగా ఎన్నికల్ని జరుపుతూ, ఇంతలా దిగజారి గెలవడానికి ప్రయత్నాలు చేస్తారా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇండస్ట్రీ పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలని ప్రకాష్రాజ్ కోరారు.