Ayodhya Ram Mandhir | అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 22న అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. భక్తీగీతాలు, భజన పాటలు, శ్రీరామ కీర్తనలతో అయోధ్య రామాలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఇక టాలీవుడ్ నటుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అయోధ్య రామ మందిరానికి హీరో ప్రభాస్ రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చారని, ప్రారంభోత్సవం నాడు భోజనాల ఖర్చు మొత్తం ఆయనే పెట్టుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని టీమ్ క్లారిటీ ఇచ్చింది.