ప్రభాస్ ఇప్పుడు తన కెరీర్ లోనే తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. వరస సినిమాలు కమిట్ అవుతూ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఇలాంటి సమయంలో తన గురించి కాకుండా పక్క హీరోల గురించి ఆలోచించే సమయం ఆయన దగ్గర లేదు. కానీ ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఒక కుర్ర హీరో గురించి ప్రభాస్ ఆలోచిస్తున్నాడు. ఎలాగైనా ఆ కుర్రాడికి సెట్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. దానికి కారణం తనకు బాగా ఇష్టమైన దర్శకుడు కావడం.. ఆ దర్శకుడు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుండడం. అందుకే ఆయన కొడుకు బాధ్యతను ప్రభాస్ తీసుకున్నాడు. ఎవరైనా జీవితంలో ఒక్కసారి మేలు చేసారంటే చచ్చేవరకు గుర్తు పెట్టుకున్నవాడే అసలైన మనిషి అంటారు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఇదే చేస్తున్నాడు.
కెరీర్ మొదట్లో వర్షం సినిమాతో తనకు మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడు శోభన్ కొడుకు బాధ్యతను ఇప్పుడు ప్రభాస్ తీసుకున్నాడు. ఆయన కెరీర్లో ఫస్ట్ బిగెస్ట్ బ్లాక్బస్టర్ వర్షం. 2004 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం అప్పట్లోనే 20 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ రెండింతలు పెరిగిపోయింది. తనకు ఇలాంటి బ్లాక్బస్టర్ సినిమాను ఇచ్చిన శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ను హీరోగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు ప్రభాస్. సొంత బ్యానర్ యువీ క్రియేషన్స్లో సంతోష్ హీరోగా ఏక్ మినీ కథ సినిమా వస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది .దీనికి ప్రమోషన్ బాధ్యతలు కూడా ప్రభాస్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే సంతోష్ శోభన్ ‘తాను-నేను’ , ‘పేపర్ బాయ్’ సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ ఆ సినిమాలు ఆడలేదు. కానీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అతడి వాయిస్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సంతోష్ శోభన్ సినిమాలో హీరోయిన్గా మోడల్ కమ్ హీరోయిన్ కావ్య థపర్ను నటిస్తుంది. నిజానికి విరాట పర్వం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా అది వాయిదా పడడంతో ఇప్పుడు అదే తేదీన ఏక్ మినీ కథ సినిమాను విడుదల చేస్తున్నారు.