కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు చిత్రసీమలో మళ్లీ వాయిదాల పర్వం మొదలైంది. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వాయిదావేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఆ జాబితాలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చేరింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదలకావాల్సిన సినిమాను వాయిదావేస్తున్నట్లు బుధవారం చిత్రబృందం వెల్లడించింది. ‘సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు గత కొన్ని రోజులుగా మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చిత్రాన్ని వాయిదావేస్తున్నాం. ప్రేమకు, విధికి మధ్య జరిగే కథ ఇది. మీరు మాపై చూపించే ప్రేమ కలిసికట్టుగా ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించేలా చేస్తుందని నమ్ముతున్నాం. పరిస్థితులు చక్కబడిన వెంటనే సినిమాను విడుదలచేస్తాం’ అని నిర్మాత సంస్థ పేర్కొన్నది. ఇటలీ బ్యాక్డ్రాప్లో వింటేజ్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించబోతున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. పూజాహెగ్డే కథానాయికగా నటించింది.