Prabhas | దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2న గ్రాండ్గా విడుదలైన ‘కాంతార: ఛాప్టర్ 1’ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పొందుతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్-ఇండియా ఫాంటసీ డ్రామా మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భక్తి, మానవత్వం, పరబ్రహ్మ భావనల మేళవింపుతో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అభినందిస్తున్నారు. ఇప్పటికే “మ్యాన్ ఆఫ్ మాసెస్” జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాగుందని ట్వీట్ చేయగా, తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా “కాంతార: ఛాప్టర్ 1 నిజమైన మాస్టర్ పీస్” అంటూ సినిమా గురించి ప్రశంసలు కురిపించారు. “ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి సినిమాను ఎప్పుడూ చూడలేదు. ఇది ఓ సినిమాటిక్ ప్రభంజనం. భక్తి ఎలా ఉంటుందో రిషబ్ అద్భుతంగా చూపించారు. ఇది ఆయన ఒంటి చేత్తో తీసిన సినిమానే కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. సినిమా బీజీఎమ్ను ఎంతగా పొగడినా తక్కువే,” అంటూ పేర్కొన్నారు. అలాగే, ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “కాంతార: ఛాప్టర్ 1 అనేది ఒక బ్రిలియంట్ మూవీ. ఇది ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు అసలు శక్తి అంటే రిషబ్ శెట్టి నటన. ఆయన నటనలో కనిపించిన భక్తి, శక్తి అసాధారణం. అలాగే నిర్మాత విజయ్ కిరగండూర్ అద్భుతంగా సినిమాను రూపొందించారు. చిత్ర యూనిట్కు నా హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.
సినిమా విడుదలైన రోజే జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి స్పందించగా, “ఇది కచ్చితంగా మరో స్థాయిలో తీసుకెళ్లే సినిమా. రిషబ్ శెట్టికి ప్రత్యేక శుభాకాంక్షలు,” అంటూ ట్వీట్ చేశారు. కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రానికి హై రేటింగ్స్ వస్తున్నాయి. డివోషనల్ సబ్జెక్ట్ను కళాత్మకంగా, కమర్షియల్ గా చూపించి ప్రేక్షకులను ఆలోచింపజేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రశంసలందుకుంటోంది. రిషబ్ శెట్టి మరోసారి తన కంటెంట్ ఎంపికలో ఎంత విలక్షణంగా ఆలోచిస్తాడో నిరూపించుకున్నాడు. ‘కాంతార: ఛాప్టర్ 1’కు మద్దతుగా స్టార్ హీరోలు స్పందించడం, సినిమా విజయం పట్ల గర్వంగా ఫీలవడం ఫ్యాన్స్కు సైతం ఆనందాన్ని కలిగిస్తోంది.