స్టార్ హీరో ప్రభాస్ తన కెరీర్లో మరో మైలురాయికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సహ నటీనటులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శుక్రవారంతో ఆయన కెరీర్ ఇరవై ఏండ్లకు చేరుకుంది. 2002, నవంబర్ 11న ఆయన నటించిన తొలి సినిమా ‘ఈశ్వర్’ విడుదలైంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ప్రభాస్ నట ప్రస్థానానికి బలమైన పునాది పడినట్లయింది. ఒక్కో విజయంతో అగ్ర తారగా ఎదిగారు ప్రభాస్. ‘వర్షం’, ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘బాహుబలి’ ఆయన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలుగా చెప్పుకోవచ్చు.
‘బాహుబలి’ రెండు భాగాల ఘన విజయాల తర్వాత ప్రభాస్ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ఈ ఇమేజ్కు అనుగుణంగానే ఆయన తన కొత్త చిత్రాల ప్లానింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మూడు ప్రాజెక్ట్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. పౌరాణిక నేపథ్య చిత్రం ‘ఆది పురుష్’, యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’, సైంటిఫిక్ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్ కె’. ఈ మూడింటిలో ‘ప్రాజెక్ట్ కె’, ‘సలార్’ రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. త్వరలో మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమాలో ప్రభాస్ నటించబోతున్నారు.