ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న పౌరాణిక నేపథ్య చిత్రం ‘ఆది పురుష్’. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ పతాకాలపై భూషణ్ కు మార్ నిర్మిస్తున్నారు. ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమా విడుదలను రానున్న జనవరి నుంచి జూన్కు మార్చారు. వచ్చే సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని జూన్ 16కు మార్చినట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ…‘ఇది మాకొక సినిమా మాత్రమే కాదు.. శ్రీ రాముడికి మేమిచ్చే కానుక. మన చరిత్ర, సం స్కృతీ సంప్రదాయాల పట్ల మాకు అంకితభావం ఉంది. ప్రేక్షకులు మరింత గొప్పగా అనుభూతి చెందేలా నిర్మాణానంతర కార్యక్రమాల కోసం ఇంకాస్త సమయం తీసుకోవాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. 2డీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్షన్స్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.